
దుర్గమ్మ సన్నిధిలో జర్నలిస్టుల ఆందోళన
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాల నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో పుష్పాలంకరణ సరిగా లేదంటూ భక్తుల అభిప్రాయాలను కథనాలు, స్క్రోలింగ్లు ప్రసారం చేయడంపై ఈవో శ్రీనానాయక్ ఆగ్రహం వ్యక్తంచేయడంపై మీడియా ప్రతినిధులు ఆందోళన చేశారు. ప్రజాభిప్రాయాన్ని ప్రసారం చేయడం చేయడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. వివరాల్లోకి వెళితే..ఆలయంలో పుష్పాలంకరణ గతేడాది బాగా చేశారు. ఈ ఏడాది నామమాత్రంగా ఉందంటూ భక్తులు విషయాన్ని మీడియా ప్రతినిధులకు తెలియజేయడంతో వారు తమ చానళ్లలో స్క్రోలింగ్లు ఇచ్చారు. ఈక్రమంలో మీడియా ప్రతినిధులు పెట్టిన స్రోల్లింగ్పై ఆలయ ఈవో శీనానాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది పుష్పాలంకరణ బాగా చేశారనేందుకు సాక్ష్యాలు ఉన్నాయా? అని మీడియా ప్రతినిధులను ప్రశ్నించడమే కాకుండా తనను అడగకుండా స్క్రోల్లింగ్ ఎలా పెడతారని ప్రశ్నించారు. దీంతో మీడియా ప్రతినిధులంతా ‘మీకు చెప్పి ఎందుకు స్రోల్లింగ్ పెట్టాలి...చేసే పనిసరిగా లేదని మాత్రమే చెబుతామని ఈవోకు బదులివ్వడంతో ఆయన మిన్నకుండిపోయారు.
ఆలయ ప్రాంగణంలో బైఠాయింపు..
మరోవైపున ఆర్డీవో మాధురి ఆలయంలోకి వెళ్లే మార్గాలకు తాళాలు వేయడం, మహిళా ప్రతినిధులు కాలకృత్యాలు తీర్చుకునేందుకు సైతం వెళ్లకుండా అడ్డుకోవడం, మీడియా ప్రతినిధుల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో నిరసన వ్యక్తమైంది. దీంతో ఆలయ ప్రాంగణంలో మీడియా ప్రతినిధులు బైఠాయించారు. ఆలయ ఈవో శీనానాయక్ మీడియా ప్రతినిధుల వద్దకు వచ్చి వారిని సముదాయించేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. మరో వైపున వీఐపీ దర్శనాల పేరిట ఇష్టానుసారంగా కొండపైకి వచ్చే వారిని మీడియా ప్రతినిధులు నిలువరించారు. వీఐపీ టైం స్లాట్ లేకపోయినా ఇష్టానుసారం దర్శనాలకు వస్తున్నారని దీంతో సామాన్య భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొంటూ వారిని కూడా క్యూలో వచ్చి దర్శనం చేసుకోవాలని పేర్కొనడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఏడీసీపీ జీ.రామకృష్ణ, వన్టౌన్ సీఐ గురుప్రకాష్ వచ్చి మీడియా ప్రతినిధులతో మాట్లాడేందుకు ప్రయత్నించినా వారు వినలేదు. చివరకు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ దుర్గగుడికి చేరుకుని మీడియా ప్రతినిధులు, మహిళా మీడియా ప్రతినిధులతో మాట్లాడి వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ శాఖలకు చెందిన అన్ని విభాగాలు తమ బంధువులను దర్శనానికి తీసుకువస్తున్నా పట్టించుకోకుండా, మీడియా ప్రతినిధులు ఎందుకు అన్నిసార్లు తిరుగుతున్నారని ప్రశ్నించడమే కాకుండా ఆంక్షలు విధించడం సరికాదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మరో మారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తానని, ఉత్సవాలలో ఇటువంటి పరిస్థితి చోటుచేసుకోవడం బాధకరమని కలెక్టర్ పేర్కొన్నారు. ఆందోళన గంటపాటు సాగగా, చివరికి కలెక్టర్ సముదాయించడంతో మీడియా ప్రతినిధులు ఆందోళనను విరమించారు.

దుర్గమ్మ సన్నిధిలో జర్నలిస్టుల ఆందోళన

దుర్గమ్మ సన్నిధిలో జర్నలిస్టుల ఆందోళన