
తాంబూలాలిచ్చాం...తన్నుకు చావండి!
మాకు సంబంధం లేదు
పెనమలూరు: మద్యం వ్యాపారుల మధ్య పోటీ మందుబాబులకు మజా సంగతేమో కాని జాతీయ రహదారిపై ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
వివరాల్లోకి వెళితే.. ఇటీవల కూటమి ప్రభుత్వం బార్ షాపులకు అనుమతులు ఇచ్చింది. తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 16 బార్లకు టెండర్లు పూర్తి చేశారు. ఇప్పటికే నాలుగు వైన్ షాపులు అమలులో ఉన్నాయి. గంగూరు చేపల కుండీలు వద్ద (పోరంకి పరిధి) మద్యం ప్రియులు వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇక్కడ గతంలో విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి పక్కనే ఒక వైన్ షాపు పెట్టి విచ్చల విడిగా మద్యం అమ్మకాలు చేశారు. వైన్ షాపులో మద్యం తాగిన వారు జాతీయ రహదారి పైకి వచ్చి వీరంగం వేస్తుండటంతో అనేక ప్రమాదాలు జరిగాయి.
కొత్తగా బార్షాపు
గతంలో బందరు రోడ్డు పక్కనే ఉన్న వైన్షాపునకు ఆనుకునే కొత్తగా బార్షాపు పెట్టారు. షామియానా వేసి రెస్టారెంట్ ఆండ్ బార్ అని బోర్డు పెట్టాడు. దీంతో పక్కనే ఉన్న వైన్షాపు..బార్ షాపు నిర్వాహకుల మధ్య గొడవ మొదలయింది. మద్యం ప్రియులను ఆకట్టుకోవటానికి ఒకరితో ఒకరు పోటీలు పడి రండి బాబూ..రండి అని చేపల మార్కెట్లో పిలుస్తున్నట్లు మద్యం ప్రియులను ఆహ్వానిస్తున్నారు.
మద్యం అమ్మకాలపై వివాదం
బార్ షాపులో లూజ్ మద్యం విక్రయాలు ఉంటాయి. వైన్ షాపులో లూజ్ మద్యం అమ్మకాలు చేయకూడదు. బార్లో ఏ ధరకై నా మద్యం అమ్ముకోవచ్చు. వైన్ షాపులో ఎమ్మార్పీ ధరలకే మద్యం అమ్మాల్సి ఉంది. వైన్ షాపునకు పర్మిట్రూమ్ ఉంటుంది. బార్ షాపులో ఇతర సౌకర్యాలు ఉంటాయి. వైన్ షాపులో లూజ్ మద్యం అమ్మకాలు చేస్తుండడంతో వ్యాపారుల మధ్య గొడవ తారస్థాయికి చేరింది. ఇరువురూ పరస్పరం నిఘా పెట్టుకున్నారు.
ప్రమాద ఘంటికలు
గంగూరు వద్ద విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి పక్కనే రెండు మద్యం షాపులు ఉండటంతో వాహనాలపై వచ్చిన వారు ఇక్కడే మద్యం తాగి ఆ తరువాత వాహనాలు నడుపుతూ వెళుతున్నారు. మద్యం ప్రియులు రాత్రి సమయాల్లో జాతీయ రహదారి పక్కనే కూర్చుని మద్యం తాగుతూ హడావుడి చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ అనేక రోడ్డు ప్రమాదాలు జరిగాయి. పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు.
రెండు మద్యం షాపుల మధ్య పోటీతో మాకు సంబంధంలేదు. నిబంధనల మేరకు అనుమతులు ఇచ్చాం. మద్యం తాగి వాహనాలు నడిపితే పోలీసులు చర్యలు తీసుకోవాలి.
– శేషగిరి, సీఐ, ఎకై ్సజ్ శాఖ