
డ్రెయినేజీ కార్యాలయంపై ఏసీబీ దాడి
● గుడివాడలో రూ.30 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన జూనియర్ అసిస్టెంట్ గరికిపాటి శ్రీనివాసరావు ● కాంట్రాక్టర్కు డిపాజిట్ సొమ్ము రిలీజ్ చేసే విషయంలో లంచం డిమాండ్
గుడివాడరూరల్: కృష్ణా జిల్లా గుడివాడలో డ్రెయినేజీ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సోమవారం దాడులు చేశారు. జూనియర్ అసిస్టెంట్, ఆడిటర్గా విధులు నిర్వహిస్తున్న గరికపాటి శ్రీనివాసరావు ఓ కాంట్రాక్టర్ను రూ.30 వేలు లంచం డిమాండ్ చేశారన్న సమాచారంతో ఏసీబీ అధికారులు కార్యాలయంపై దాడులు నిర్వహించి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ కేసు వివరాలను ఏసీబీ డీఎస్పీ బి.వి.సుబ్బారావు మీడియాకు వెల్లడించారు. గుడివాడ డ్రెయినేజీ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు కాంట్రాక్టర్ తురక రాజాను రూ.30 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ఆ కాంట్రాక్టర్ డ్రెయినేజీలో కొన్ని వర్కులు చేయగా వాటి బిల్లులు రూ.33 లక్షలు మంజూరయ్యాయి. దానికి సంబంధించి ఒక్క శాతం సొమ్మును కాంట్రాక్టర్ ఇవ్వలేదు. అయితే కాంట్రాక్టర్కు మరొక వర్క్కు సంబంధించి రెండు డిపాజిట్ల సొమ్ము రూ.1.7 లక్షలను రిలీజ్ చేయాల్సి ఉంది. దానికి రూ.30 వేల లంచం ఇవ్వాలని జూనియర్ అసిస్టెంట్ గరికపాటి శ్రీనివాసరావు డిమాండ్ చేశాడు. దీంతో కాంట్రాక్టర్ తురక రాజా ఏసీబీ అధికారులను ఆశ్రయించారన్నారు. ఏసీబీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాజా డ్రెయినేజీ కార్యాలయానికి వెళ్లి జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావుకు రూ.30 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. దాడుల్లో ఏసీబీ సీఐలు జి.వి.వి.సత్యనారాయణ, ఎం.వి.ఎస్.నాగరాజు, ఎస్ఐ పూర్ణిమ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.