
పీహెచ్సీల్లో కాన్పులు పెరగాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలను పెంచాలని, రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులను మాత్రమే పెద్ద ఆస్పత్రులకు పంపాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని సూచించారు. జిల్లాలోని పీహెచ్సీ, యూపీహెచ్సీ వైద్యాధికారులతో ఆరోగ్య కార్యక్రమాల అమలుపై శనివారం విజయవా డలోని తన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాచర్ల సుహాసిని మాట్లాడుతూ.. ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల నమోదు, ఎన్సీడీ– సీడీ సర్వే, గర్భిణుల నమోదు వంటి కార్యక్రమాల లక్ష్యసాధనలో వెనుకబడి ఉన్న గ్రామీణ ప్రాంత వైద్యాధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు. లక్ష్యాలను తప్పనిసరిగా చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఇందుమతి, ఆర్బీఎస్కే అధికారి డాక్టర్ మాధవి, మాతృసంరక్షణ నోడల్ అధికారి డాక్టర్ పద్మావతి, డీపీహెచ్ఎన్ డీపీఎంఓ డాక్టర్ నవీన్, లిడియా ఇతర వైద్యాధికారులు, పలువురు పర్యవేక్షకులు పాల్గొన్నారు.
కొండపల్లి బొమ్మల ఖ్యాతిని భావితరాలకు చాటాలి
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): దేశ విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన కొండపల్లి బొమ్మల ఔన్నత్యాన్ని భావితరాలకు చాటి చెప్పేలా ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లిలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు పనులను క్షేత్రస్థాయిలో శనివారం పరిశీలించి పలు సూచనలు చేశారు. చారిత్రక, సాంస్కృతిక ఔన్నత్యమున్న జిల్లాను పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. శతాబ్దాల నేపథ్యం కలిగిన కొండపల్లి బొమ్మ విశిష్టతను పర్యాటకులకు చాటిచెప్పేలా ఎక్స్పీరియన్స్ సెంటర్ అభివృద్ధి చేస్తామన్నారు. అందమైన పెయింటింగ్స్తో ఈ సెంటర్ను అద్భుతంగా తీర్చిదిద్దాలని సూచించారు. కొండపల్లి ఖిల్లా ట్రెక్కింగ్కు అనుకూలంగా మెట్లమార్గం అభివృద్ధి చేస్తామన్నారు. ఏపీ టూరిజం అథారిటీ చీఫ్ మార్కెంటింగ్ ఆఫీసర్ ఎస్.పద్మారాణి, టూరిజం కన్సల్టెంట్ సాహితి, జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప, మునిసిపల్ కమిషనర్ రమ్యకీర్తన, తహసీల్దార్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
21న జిల్లా విద్యాశాఖ కార్యాలయం ముట్టడి
కూటమి విధానాలపై వైఎస్సార్ టీఎఫ్ తిరుగుబాటు
మచిలీపట్నంఅర్బన్: ఉపాధ్యాయ బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ మే 21వ తేదీ జిల్లా విద్యాశాఖ కార్యాలయం ముట్టడి చేస్తున్నట్లు ఆ సంఘ కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల అధ్యక్షులు మల్లంపల్లి వెంకట మహంకాళిరావు, టి. జగదేశ్వర్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీలపై కూటమి ప్రభుత్వం తీసు కుంటున్న అస్పష్టమైన, అస్తవ్యస్త విధానాలపై ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఉపాధ్యాయ సంఘాలు ఇటీవల విజయవాడలో జరిగిన కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సమావేశాన్ని బహిష్కరించాయని తెలిపారు. గుర్తింపు పొందిన తొమ్మిది ఉపాధ్యాయ సంఘాలు సంయుక్తంగా ఆందోళన కార్యక్రమాలు చేయాలని నిర్ణయించాయని వివరించారు. దీనిలో భాగంగా ఈ నెల 21న మచిలీపట్నంలోని ఉమ్మడి జిల్లాల విద్యాశాఖ కార్యాలయం ముట్టడికి నిర్ణయించామని తెలిపారు. 23న విజయవాడలో డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేస్తామని పేర్కొన్నారు.

పీహెచ్సీల్లో కాన్పులు పెరగాలి