● రాత్రి సమయంలో ప్రమాదాలు
● కల్లాలు లేక రోడ్లపై ధాన్యం ఆరబోస్తున్న రైతులు
రేడియం స్టిక్కర్లు పెట్టాలి..
రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోస్తున్నప్పుడు కర్రలు ఏర్పాటు చేసుకొని వాటికి రేడియం స్టిక్కర్లను అతికించుకోవాలి. దీంతో వాహనదారులు వాటిని గుర్తించి జాగ్రత్తపడతారు. ఒక్కో స్టిక్కరు ఖరీదు రూ.250 వరకు ఉంటుంది. రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేసుకోవాలని మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులకు అవగాహన కల్పించాం. ఒక్కో సర్పంచ్ పది స్టిక్కర్లు కొనుగోలు చేసి రైతులకు అందించాలని సూచించా. తాను పది స్టిక్కర్లకు ఆర్డర్ చేశా. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. రోడ్డు ప్రమాదాలు జరిగితే కేసులు నమోదు చేస్తాం.
– చంద్రమోహన్, ఎస్సై
రెంజల్(బోధన్): జిల్లాలో యాసంగి సీజన్ వరి కోతలు ఊపందుకున్నాయి. అయితే, వరి పొలాల్లో ధాన్యం ఆరబెట్టుకునేందుకు వసతులు లేక రైతులు ధాన్యాన్ని రోడ్లపై పోస్తున్నారు. రహదారులపై సగం వరకు ధాన్యంతో కప్పేయడంతో రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. రాత్రి సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండు రోజుల కిందట రెంజల్ మండలం సాటాపూర్ వద్ద జరిగిన ప్రమాదంలో ఇరువురికి గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కల్లాలు లేకపోవడంతో రైతులు రోడ్లను ఆశ్రయిస్తుండగా వాహనదారులకు మాత్రం ప్రాణ సంకటంగా మారింది. రాత్రివేళల్లో వాహనదారులు జారిపడుతున్నారు.


