● రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు..
● కరెంట్ షాక్తో ఒకరు
చందూరు మండలంలో..
వర్ని: చందూరు మండలం ఘన్పూర్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. వర్ని ఎస్సై వంశీకృష్ణ తెలిపిన వివరాలు ఇలా.. ఘన్పూర్ గ్రామానికి చెందిన రమేష్, లక్ష్మణ్లు బైక్పై హుమ్నాపూర్ వెళ్లగా శనివారం తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. ఘన్పూర్ శివారులో వారి బైక్ ప్రమాదవశాత్తు అదుపుతప్పడంతో ఇద్దరు కిందపడ్డారు. ఈ ఘటనలో రమేష్(38) అక్కడికక్కడే మృతిచెందగా, లక్ష్మణ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు లక్ష్మణ్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
కోటగిరి మండలంలో..
రుద్రూర్: మండలంలోని సులేమాన్ ఫారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా.. కోటగిరి మండల కేంద్రానికి చెందిన మస్కల లింగయ్య (32) అనే యువకుడు పని నిమిత్తం ఈ నెల 2న సాయంత్రం తన టీవీఎస్ ఎక్స్ఎల్పై బయటకు వెళ్లాడు. సులేమాన్ ఫారం మార్గమధ్యలో అతడి వాహనం అదుపుతప్పి పోలం సమీపంలో ఉన్న గుంతలో పడిపోయాడు. ఈ ఘటనలో లింగయ్యకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. శనివారం అటువైపుగా వెళ్లిన వారు అతడి మృతదేహన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం మృతుడి భార్య సంధ్యారాణి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వారు తెలిపారు.
ఎల్లారెడ్డిలో..
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన ఓ రైతు ప్ర మాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. ఎల్లారెడ్డికి చెందిన మర్లు రామకిష్టయ్య (60) అనే రైతు శనివారం పొలంలో గడ్డి కోసేందుకు వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు అతడికి విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో పలువురు మృతిచెందారు. చందూరు, కోటగిరి మండలాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత చెందగా, ఎల్లారెడ్డిలో ఓ రైతు కరెంట్షాక్తో మరణించాడు. అలాగే ధర్పల్లి మండలంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన యువకుడి మృతదేహం లభ్యమైంది.


