క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Mar 29 2026 7:25 AM | Updated on Mar 29 2026 7:25 AM

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం పెర్కిట్‌లో ఒకరి ఆత్మహత్య వ్యభిచార గృహాలపై పోలీసుల దాడులు పేకాడుతున్న 8మంది అరెస్టు

జక్రాన్‌పల్లి: మండలంలోని మునిపల్లి గ్రామ శివారులోగల 63వ నెంబర్‌ జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై మహేష్‌ తెలిపారు. జాతీయ రహదారిపై శనివారం వేకువజామున ఆర్మూర్‌ నుంచి నిజామాబాద్‌ వెళ్లే మార్గంలో గుర్తుతెలియని వ్యక్తిని వాహనం ఢీకొట్టినట్లు తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని, వయస్సు సుమారు 50 నుంచి 60 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. తెల్లని మాసిన షర్ట్‌, నల్లని ప్యాంట్‌ వేసుకున్నాడని తెలిపారు. మృతదేహాన్ని ఆర్మూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు జక్రాన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో లేదా సెల్‌నెంబర్‌ 8712659853, 8712359742ను సంప్రదించాలన్నారు.

కామారెడ్డి అర్బన్‌: కామారెడ్డి పట్టణ పరిధిలోని లింగాపూర్‌ చెరువులో గుర్తుతెలియని మహిళా మృతదేహం లభ్యమైనట్లు దేవునిపల్లి పోలీసులు శనివారంం తెలిపారు. చెరువులో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మహిళ వయస్సు సుమారు 35–40 ఏళ్ల మధ్య ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఎవరైనా మృతురాలిని గుర్తిస్తే దేవునిపల్లి పోలీసులను సంప్రదించాలన్నారు.

ఆర్మూర్‌టౌన్‌: ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని పెర్కిట్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. భీంగల్‌ మండలం చెంగాల్‌ గ్రామానికి చెందిన ముందెల రాజేశ్వర్‌(51)ఈనెల 24న ఆర్మూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్య పరీక్షల కోసం అడ్మిట్‌ అయ్యాడు. తన కుడి కాలుకు ఇన్‌ఫెక్షన్‌ కావడంతో వేలును తొలగించాలని వైద్యులు తెలిపారు. దీంతో అతడు భయపడి ఆస్పత్రి నుంచి ఈనెల 27న ఉదయం ఎవరికి చెప్పకుండ వెళ్లిపోయాడు. అనంతరం పెర్కిట్‌లోని విశ్వబ్రాహ్మణ సంఘ భవనం సమీపంలో ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్‌ తెలిపారు.

నిజామాబాద్‌అర్బన్‌: నగరంలోని గాయత్రీనగర్‌లో వ్యభిచార గృహాలపై సీసీఎస్‌ పోలీసులు దాడి చేశారు. ఇద్దరు విటులను, ఇద్దరు విటురాలను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ.5690 నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని నాలుగోటౌన్‌ పోలీసులకు అప్పగించారు.

నిజామాబాద్‌అర్బన్‌: నగరంలోని సారంగాపూర్‌లో పేకాట స్థావరంపై సీసీఎస్‌ పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని పట్టుకున్నారు. అలాగే వారి వద్ద నుంచి ఏడు సెల్‌ ఫోన్లు, రూ.5300 నగదు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement