అతి జాగ్రత్త్త.. అతి కొనుగోళ్లు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : పెట్రోల్, డీజిల్, గృహ వినియోగ గ్యాస్ పుష్కలంగా ఉందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ ప్రజలు అవసరానికి మించి కొనుగోలు చేస్తుండడంతో సమస్య ఉత్పన్నమవుతోంది. కొరత వస్తుందనే వదంతుల నేపథ్యంలో అతిజాగ్రత్త పడుతున్న ప్రజలు.. ఇంధనం, గ్యాస్ ను అతిగా కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదనుగా జిల్లాలో కొందరు డీలర్లు కృత్రిమ కొరత సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో బంక్ల వద్ద, గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారులు భారీగా బారులు తీరుతున్నారు. పెట్రోల్, డీజిల్ విషయానికి వస్తే అత్యధికమంది అవసరానికి మించి కొనుగోలు చేస్తున్నారు.
కొందరైతే ఏకంగా ప్లాస్టిక్ టిన్నుల్లో నింపుకుంటున్నారు. దీంతో జిల్లాలో సాధారణానికి మించి విక్రయాలు జరుగుతున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారుల చెబుతున్నారు. కొందరు గ్యాస్ డీలర్లు మాత్రం ఇదే అదనుగా ఇష్టం వచ్చినట్లు రీఫిల్లింగ్ దందా చేస్తున్నారు. బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు రెండువారాలు దాటినప్పటికీ డెలివరీ చేయకుండా బ్లాక్ మార్కెట్లో కమర్షియల్ వినియోగదారులకు రీ ఫిల్లింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అత్యవసరమైన గృహ వినియోగదారుల వద్ద నుంచి రూ.2,500 నుంచి రూ.3,500 వరకు వసూలు చేసిన డీలర్లు సైతం ఉండడం గమనార్హం.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ వినియోగదారు లు అసత్య ప్రచారాన్ని నమ్మొద్దు. అ పోహలు పెట్టుకుని అవసరానికి మించి ఫ్యూయల్ కొనుగోలు చేయొద్దు. ఇ లా చేయడంతో అత్యవసర వినియోగదారులకు సమస్యలు తప్పవు. ముందు జాగ్రత్త అనుకుంటూ భారీగా కొనుగోళ్లు చేసి నిల్వ చేసుకుంటే ఉపయోగం లేదు. అది ప్రమాదం కూడా.
– నల్ల దినేష్రెడ్డి, తెలంగాణ పెట్రో డీలర్స్ అసోసియేషన్
వ్యవస్థాపక అధ్యక్షుడు
పెట్రోల్, డీజిల్ కొరత వదంతులను నమ్మొద్దు. కలెక్టర్ ఇలా త్రిపాఠి నేతృత్వంలో నిరంతరం పరిస్థితిని సమీక్షి స్తున్నాం. జిల్లా వ్యాప్తంగా 211 పెట్రో ల్ బంకుల్లో నిరంతరం పెట్రోల్, డీజిల్ అమ్మకాలు సాగుతున్నాయి. కృత్రిమ కొర త సృష్టించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లాలో ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదు. గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడితే కఠిన చర్యలు తీసుకుంటాం.
– శ్రీకాంత్రెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి
పెట్రోల్ కొరతపై సోషల్ మీడియాలో ప్రచారం, వదంతులను నమ్మొద్దు. పెట్రోల్, డీజిల్ కోసం గంటలపాటు వేచి చూడొద్దు. అదనంగా క్యాన్లు, బాటిళ్లులో నింపి నిల్వ చేసుకుంటే వేసవికాలంలో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉంచామని ప్రకటనలు చేస్తూనే ఉన్నాయి.
– కవిత రాజు, హెచ్పీ పెట్రోల్ బంక్ యజమాని
రెండు, మూడు రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ కొరత అంటూ ప్రచారం జరుగుతోంది. కానీ ఎక్కడికి వెళ్లినా బంకుల్లో పెట్రోల్, డీజిల్ దొరుకుతోంది. తప్పు డు ప్రచారాన్ని వాహనదారులు నమ్మొ ద్దు. ప్రతి రోజూ అవసరం మేరకు నా వాహనంలో పెట్రోల్ కొట్టిస్తున్నా. పెట్రోల్, డీజిల్పై వస్తున్న వదంతులను నమ్మొద్దు. ప్రమాదకరమైన ఇంధనాన్ని ఇళ్లలో నిల్వ చేసుకోవద్దు.
– బాలేరావు వేణుగోపాల్, వాహనదారుడు, నిజామాబాద్
అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లు
బంకుల వద్ద బారులు
ఇదే అదనుగా కృత్రిమ కొరత
అదనపు వసూళ్లకు
తెరలేపిన కొందరు
గ్యాస్ డీలర్లు


