ఏఐ ప్రచారం.. ఏదైనా సాధ్యం
● పంచాయతీ ఎన్నికల్లో
సాంకేతిక పరిజ్ఞానం వినియోగం
● కృత్రిమ మేధా వీడియోలు, పాటలు, ఫొటోలతో హోరెత్తిస్తున్న అభ్యర్థులు
నందిపేట్(ఆర్మూర్): ప్రస్తుతం పల్లెల్లో పంచాయతీ ఎన్నికల వేడి పెరిగింది. అభ్యర్థులు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేపట్టడంతోపాటు సెల్ఫోన్లో ఏఐ ఆధారిత ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. సాధారణంగా ప్రజలకు సాధ్యంకాని చిత్రాలు, వీడియోలను సైతం కృత్రిమ మేధా ద్వారా క్రియేట్ చేసి, ఏఐతో ఏదైనా సాధ్యమేనని నిరూపిస్తూ కొత్త ప్రచారాలకు తెరలేపారు.
కొత్త ట్రెండ్పై ఆసక్తి..
మండల కేంద్రాలతోపాటు మేజర్ గ్రామపంచాయతీలలో ముగ్గురు, నలుగురు పోటీపడటం ఎక్కువగా కనిపిస్తుంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు బృందాలుగా వెళ్తు కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా కొత్తపుంతలతో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. షార్ట్ వీడియోలు, ఏఐ చిత్రాలను సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా వినియోగిస్తూ ముమ్మరంగా ప్రచారం కొనసాగించడంపై అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం అంతా షార్ట్ వీడియోల ట్రెండ్ నడుస్తుంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయాత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
వాట్సాప్ గ్రూపులతో..
కొందరు అభ్యర్థులు గ్రామస్తుల సెల్ఫోన్ నంబర్లతో వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. వాటిల్లో గ్రామాల్లో చేపట్టే పనుల వివరాలు, అభివృద్ధి సందేశాలు, హామీలు అయిదేళ్లలో చేపట్టబోయే కార్యక్రమాలతో వివిధ రకాల పోస్టులు పెడుతున్నారు. స్థానిక సమస్యలపై వీడియోలు చేస్తూ సమస్యలను పరిష్కరిస్తామని హామీలు గుప్పిస్తున్నారు. పోటీలో నిలబడే వారి గుర్తులు, పేర్లతో వీడియోలు, పాటలను రూపొందిస్తున్నారు. తమకు ఓటు వేసి గెలిపించాలంటూ అభ్యర్థి వాయిస్తో నిత్యం రోజుకు నాలుగు ఐదు సార్లు ఫోన్ద్వారా వాయిస్ మెసెజ్ ద్వారా అభ్యర్థిస్తున్నారు.
మచ్చుకు కొన్ని..
● నందిపేట మండల కేంద్రంలో సర్పంచి అభ్యర్థి ఒకరు 45 సెకన్ల నిడివితో రూపొందించిన ఏఐ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీన్ని కొందరు అభిమానులు స్టేటస్లుగా పెట్టుకున్నారు. మరికొందరు తమ గ్రూపులలో పోస్టు చేస్తున్నారు.
● నందిపేట మండలంలోని లక్కంపల్లి గ్రామంలో ఓ సర్పంచ్ అభ్యర్థి తనను గెలిపిస్తే చేపట్టబోయే అభివృద్ధిని ప్రస్తుతం ఉన్న పరిస్థితిని వివరిస్తూ పోస్టులు పెడుతున్నారు.
● నందిపేట మండలంలోని ఉమ్మెడ గ్రామంలో పలు రకాల పనులను సొంత ఖర్చులతో చేపడుతానని ప్రభుత్వ నిధులతో మరిన్ని అభివృద్ధి పనుల చేపడుతానని చెబుతూ గ్రామపంచాయతీ నిధులు ఒక్క రూపాయి వాడుకున్నా తన ఆస్తులను జప్తు చేస్తానని బాండు పేపరు రాసి ఇంటింటికి ప్రచారం చేస్తూ తన అనుయాయులతో సామాజిక మాధ్యమాల్లో ఏఐ ప్రచారం చేస్తున్నాడు.
● నందిపేటలో ఓ సర్పంచి అభ్యర్థి తన గుర్తుతో పా టు ప్రచారంలో పాల్గొ న్న వారి వీడియోలు, ఫోటోలను స్థానిక గ్రూ పుల్లో పాటలను జోడించి ఏఐ ద్వారా ప్రచారం చేస్తున్నారు.
ఏఐ ప్రచారం.. ఏదైనా సాధ్యం
ఏఐ ప్రచారం.. ఏదైనా సాధ్యం


