ముసాయిదా మాస్టర్ ప్లాన్పై సమీక్ష
● ఆర్మూర్, బోధన్ టౌన్ప్లానింగ్
అధికారులతో సమావేశం
● వారం రోజుల్లో నివేదిక
సమర్పించాలని కలెక్టర్ ఆదేశం
నిజామాబాద్ సిటీ : అమృత్ 2.0లో భాగంగా జిల్లాలోని బోధన్, ఆర్మూర్ మున్సిపల్ పట్టణాలలో ముసాయిదా మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. మంగళవారం బల్దియా కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్తోపాటు వర్క్షాప్పై అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సౌకర్యాలను మెరుగుపరుస్తూ, ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలన్నారు. అధికారులు నిర్ణీత నమూనాలో ముసాయిదా మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు నివేదిక సిద్ధం చేయాలన్నారు. మున్సిపాలిటీలలో డ్రోన్ సర్వే, ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల పరిశీలన పూర్తయ్యిందన్నారు. రానున్న 20 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని, సంబంధిత శాఖలు అందించే వివరాలను క్రోడీకరిస్తూ ముసాయిదా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు.
ముసాయిదా మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరిగాక, అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, ఏవైనా అభ్యంతరాలు వస్తే, వాటిని పరిష్కరించి తుది మాస్టర్ ప్లాన్ రూపొందించి ఆమోదం నిమిత్తం ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. ఇప్పటికే నిజామాబాద్ నగర ముసాయిదా మాస్టర్ ప్లాన్ను ప్రభుత్వానికి పంపామని తెలిపారు. పట్టణాల భవిష్యత్ అభివృద్ధి, తాగునీటి సరఫరా మెరుగుదల, పార్కుల అభివృద్ధి వంటి వాటికి మాస్టర్ ప్లాన్ ఏవిధంగా ఉపకరిస్తుంది అనే అంశాలను అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ జాయింట్ డైరెక్టర్ రష్మీ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, డీఆర్డీవో సాయాగౌడ్, బోధన్, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్లు జాదవ్, రాజు, మున్సిపల్, రెవెన్యూ, పబ్లిక్ హెల్త్, జిల్లా పరిశ్రమలు, జాతీయ రహదారులు, రోడ్లు–భవనాలు, పంచాయతీరాజ్, ఇరిగేషన్, మెప్మా, రైల్వే, ఆర్టీసీ, రవాణా, పోలీస్, టూరిజం, ట్రాన్స్కో, విద్య, వైద్యం, వ్యవసాయం, గనులు, కాలుష్య నియంత్రణ మండలి తదితర అధికారులు పాల్గొన్నారు.


