
యువవికాసం లబ్ధిదారులకు 2న మంజూరు పత్రాలు
నిజామాబాద్ అర్బన్: రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన మంజూరు పత్రాలు (ప్రొసీడింగ్స్) అందజేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి డిప్యూటీ సీఎం బుధవారం సాయంత్రం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా రాజీవ్ యువవికాసంపై సమీక్షించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా లబ్ధిదారులకు మంజారు ప్రత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్కు సూచించారు. లబ్ధిదారులకు జూన్ 10 నుంచి 15వ తేదీ వరకు యూనిట్ల స్థాపన, నిర్వహణ, మార్కెటింగ్ తదితర అంశాలపై శిక్షణ ఉంటుందని తెలిపారు. జూన్ 16 నుంచి 20వ తేదీ వరకు సబ్సిడీ మొత్తాన్ని విడుదల చేస్తారని, 21 నుంచి 30వ తేదీ వరకు యూనిట్ల గ్రౌండింగ్ జరిగేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు. షెడ్యూల్ను అనుసరిస్తూ జూలైలో రూ.లక్ష నుంచి రూ.2లక్షల లోపు కేటగిరీకి చెందిన లబ్ధిదారులకు, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో రూ.2లక్షల నుంచి రూ. నాలుగు లక్షల కేటగిరీకి చెందిన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. స్థానిక పరిస్థితులు, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా లబ్ధిదారులు యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాజీవ్ యువ వికాసం పథకం నిరంతర ప్రక్రియ అని, లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వీసీలో లీడ్ బ్యాంక్ మేనేజర్ అశోక్చౌహాన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నాగూరావు, బీసీ సంక్షేమ శాఖ సహా య అధికారి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
మొదటగా రూ. 50 వేలు, రూ.లక్ష లోపు కేటగిరీల వారికి అందజేత
లబ్ధిదారులు యూనిట్లు స్థాపించి ఆర్థిక పురోగతి సాధించేలా పర్యవేక్షించాలి
వీసీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క