
యూనిట్లు ఏర్పాటయ్యేనా ?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో జిల్లాలోని నందిపేట మండలం లక్కంపల్లి వద్ద సెజ్ (ప్రత్యేక ఆర్థిక మండలి) ఏర్పాటు చేశారు.
వ్యవసాయ రంగంలో ముందంజలో ఉన్న జి ల్లాలో పంట ఉత్పత్తులకు అదనపు విలువ జోడించి అంతర్జాతీయ ఎగుమతులను ప్రోత్సహించే లక్ష్యంతో 2009లో వైఎస్ఆర్ దీనికి రూపకల్పన చేశారు. వ్యవసాయ అనుబంధ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించి స్థానికంగా ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు గాను రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా 429 ఎకరాలు కేటాయించారు. వైఎస్ఆర్ మరణం తరువాత అప్పటి మంత్రి పొ ద్దుటూరి సుదర్శన్రెడ్డి దీని కోసం రూ.50 కోట్లు కేంద్రం నుంచి మంజూరు చేయించారు. అప్పటి కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్పవార్ సహకారంతో ఈ నిధులు తీసుకొచ్చారు. ప్రహరీతోపాటు రోడ్లు నిర్మించారు. స్మార్ట్ ఆగ్రో కర్క్యుమిన్ యూనిట్తో పాటు కొన్ని గోదాములు నెలకొల్పారు. అయితే తెలంగాణ ఏర్పాటు తరువాత గత పదకొండేళ్లలో ఈ సెజ్లోకి ఒక్క యూనిట్ రాకపోవడం గమనార్హం. దేశంలోనే పేరెన్నిక గన్న పతంజలి సంస్థ 2017లో ఇందులో యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు రాగా అప్పటి స్థానిక ఎమ్మెల్యే పర్సంటేజీలు అడగడంతో వెనక్కు వెళ్లినట్లు తెలిసింది. ఇదేవిధంగా మరికొందరు పెట్టుబడిదారులు సైతం వెనక్కు వెళ్లిపోయారు. దీంతో సదరు అప్పటి ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఇదే అవకాశంగా భావించి 200 ఎకరాల కబ్జాకు రంగం సిద్ధం చేశాడని ఆరోపణలు మిన్నంటాయి. ఈ క్రమంలో ఇందులో ఉన్న గుట్టను సైతం టీఎస్ఐఐసీ నిబంధనలకు విరుద్ధంగా తవ్వించి తన అనుచరుల ద్వారా మొరం అమ్మించాడని విమర్శలు సైతం వచ్చాయి.
లక్కంపల్లి స్మార్ట్ ఆగ్రో ఫుడ్ పార్క్ లోని గోదాములు
200 ఎకరాల్లో కేసీఆర్ టౌన్షిప్ పేరిట 5,058 ప్లాట్లకు లేఅవుట్..
2009లో రూపకల్పన..
429 ఎకరాల కేటాయింపు
ఇప్పటివరకు యూనిట్లు
నెలకొల్పని పరిస్థితి
వ్యవసాయ అనుబంధ యూనిట్లు ఏర్పాటు చేయాలంటున్న ఔత్సాహికులు
రెండు వందల ఎకరాల సెజ్ భూములను కబ్జా చేసి అందులో 5,058 ప్లాట్లు వేసేలా లేఅవుట్ ప్లాన్ తయారు చేయడం గమనార్హం. ఇందులో బ్లాక్–1లో 2,715 ప్లాట్లు, బ్లాక్–2లో 2,343 ప్లాట్లు ఉండేలా వెంచర్ ప్లాన్ రూపొందించడం ప్రత్యేకం. ఈ అక్రమ వ్యవహారాలపై ప్రశ్నించిన వ్యక్తులపై అక్రమంగా అప్పటి ఎమ్మెల్యే కేసులు పెట్టించాడని చెబుతారు. ఒక వ్యక్తిపై అట్రాసిటీ, మరో నలుగురిపై ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించినట్లు అక్రమంగా కేసులు నమోదు చేయించడం విశేషం. సెజ్ భూముల్లో అక్రమంగా లేఅవుట్ చేసేందుకు సహకరించిన అప్పటి పంచాయతీ కార్యదర్శి రమేశ్ ద్వారా ప్రశ్నించిన నలుగురు వ్యక్తులపై విధులకు ఆటంకపరిచారనే నెపంతో అక్రమంగా కేసులు పెట్టడం గమనార్హం. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని స్ట్రీమ్లైన్ చేసి వ్యవసాయ అనుబంధ యూనిట్లు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ప్రోత్సహించి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని జౌత్సాహికులు కోరుతున్నారు.