అర్హుల జాబితా జల్లెడ | - | Sakshi
Sakshi News home page

అర్హుల జాబితా జల్లెడ

May 5 2025 8:01 PM | Updated on May 5 2025 8:01 PM

అర్హుల జాబితా జల్లెడ

అర్హుల జాబితా జల్లెడ

మోర్తాడ్‌(బాల్కొండ): ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఇంటి నిర్మాణ సాయం అందుకునేవారిలో పక్కాగా అర్హులే ఉండాలనే ఉద్దేశంతో అధికారుల బృందం మరోమారు సర్వే చేపట్టింది. మొదట ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని అధికారులు స్వయంగా కలిసి అర్హత ఉందో లేదా అని తేల్చేందుకు సాంకేతికత సాయంతో సర్వే నిర్వహించారు. అధికారులు సిద్ధం చేసిన అర్హుల జాబితాలను ఇందిరమ్మ కమిటీలు పరిశీలించి లబ్ధి పొందేవారిని ఎంపిక చేశారు. కాగా, ఇందిరమ్మ కమిటీలో ఎక్కువగా అధికార పార్టీ నియమించిన వారే సభ్యులుగా ఉండటంతో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా సాగిందో లేదో అనే సందేహంతో మరోమారు సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్దేశించింది. కమిటీ సిద్ధం చేసిన తుది జాబితాలోనూ అనర్హులుంటే వారిని తొలగించాలని ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మండల స్థాయిలో పంచాయతీరాజ్‌ శాఖ ఉద్యోగులు, పట్టణాలలో మున్సిపల్‌ ఉద్యోగులు సర్వే నిర్వహిస్తూ అర్హుల కోసం జల్లెడ పడుతున్నారు. కాగా, వితంతువులు, దివ్యాంగులు, పూరి గుడిసెలో ఉన్నవారు, ప్రమాదవశాత్తు ఇళ్లు కోల్పోయిన వారికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం సూచించగా అవే మార్గదర్శకాలను అధికారులు అనుసరిస్తున్నారు.

నిర్మాణంపై అవగాహన..

అర్హులైన వారు ఇందిరమ్మ ఇంటి సాయం అందుకునేందుకు పాటించాల్సిన మార్గదర్శకాలను అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగులకు ఇచ్చిన యాప్‌లో ఇంటి నిర్మాణ విస్తీర్ణం పక్కాగా లెక్క కట్టే నైపుణ్యం ఉంది. దీంతో 400 చదరపు అడుగులకు తక్కువ కాకుండా 600 చదరపు అడుగులకు ఎక్కువ కాకుండా ఇంటి నిర్మాణం చేపట్టాలని సూచిస్తున్నారు. తొలి విడతలో కొందరు ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించడంతో వారికి బిల్లు మంజూరు సాధ్యం కాలేదు.

కసరత్తు చేస్తున్నాం

ఇందిరమ్మ కమిటీలు ఎంపిక చేసిన వారిలో ఎవరైనా అనర్హులుంటే వారి పేర్లను తొలగిస్తున్నాం. పక్కాగా అర్హులైన వారికే ఇందిరమ్మ ఇంటి నిర్మాణ సాయం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏ ఒక్క అనర్హునికి పథకం వర్తింపజేయడం జరుగదు. – తిరుమల, ఎంపీడీవో, మోర్తాడ్‌

మంజూరు నామమాత్రమే..

ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకుంటే రూ.5 లక్షల సాయం అందిస్తామని ప్రభుత్వం వెల్లడించిన విషయం విదితమే. 2024–25 ఆర్థిక సంవత్సరానికి జిల్లా మొత్తంలో ఎంపిక చేసిన 31 గ్రామాలలో కేవలం 2,762 మందికే సాంకేతిక ఆమోదం తెలిపారు. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల నిర్మాణానికి సాయం అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. అర్బన్‌ నియోజకవర్గంతో సహా మిగిలిన అన్ని చోట్లా మరో 16వేలకు పైగా ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చి దశల వారీగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. కాగా, గృహ నిర్మాణసంస్థలో ఉద్యోగుల కొరత కారణంగా ఇళ్ల నిర్మాణానికి సాంకేతిక ఆమోదం తెలిపినా గ్రౌండింగ్‌తోపాటు ఇంటి నిర్మాణ దశల వారి పరిశీలన అత్యంత కష్టతరంగా మారింది.

పేదలకే ఇందిరమ్మ ఇళ్ల పథకం

వర్తించేలా చర్యలు

అనర్హుల తొలగింపునకు మరోమారు సర్వే నిర్వహిస్తున్న అధికారుల బృందం

క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ కమిటీలు ఫైనల్‌ చేసిన జాబితాల పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement