
నియంత్రించలేకపోతున్నారు!
● ఎత్తిపోతల పథకాలే లక్ష్యంగా
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల చోరీలు
● లక్షలాది రూపాయల నష్టం
● పది నెలల్లో పది ఘటనలు
● ఆందోళనలో రైతాంగం
నందిపేట్: జిల్లాలో ఎత్తిపోతల పథకాలే లక్ష్యంగా వరుస చోరీలు జరుగుతున్నాయి. పది నెలల్లో పది ఘటనలు చోటుచేసుకున్నాయి. దుండగులు విద్యు త్ ట్రాన్స్ఫార్మర్లలోని విలువైన సామగ్రిని ఎత్తుకెళ్తున్నారు. వీటిపై ఆయకట్టు రైతుల సమాచారం మేర కు ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చే స్తున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. ఇంతవర కు ఎవరు, ఎందుకు చోరీలకు పాల్పడుతున్నారనేది తేల్చలేకపోతున్నారు. జిల్లాలో చోరీల్లో అత్యధికంగా ఉమ్మడి నందిపేట మండలంలోనే జరగడం గమనార్హం. అందులో తల్వేద ఎత్తిపోతల పథకంలో ఇప్పటి వరకు మూడు సార్లు చోరీలు జరిగాయి.
ఒకే తరహాలో ఘటనలు
పది నెలల నుంచి జిల్లాలో వరుస ఘటనలు ఒకే తరహాలో జరుగుతున్నప్పటికీ చోరీలకు పాల్పడుతున్నది ఎవరనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. దుండగులు ఎత్తిపోతల పథకాల వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి రూ. లక్షల విలువైన రాగి కాయిల్స్, ఇంధనం, ఇతర పరికరాలను అపహరించుకు పోతున్నారు. ప్రతి చోట ఒకే తరహాలో ఘటనలు చోటు చేసుకుంటున్నాయంటే అనుభవం ఉన్న వ్యక్తులే ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నట్లు రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయినా ఒక్క కేసు కూడా దర్యాప్తు కొలిక్కి రాలేదు.
వేల ఎకరాలకు ఇబ్బందులు
ఎత్తిపోతల పథకాల ట్రాన్స్ఫార్మర్లు పనిచేయక పోవడంతో వేల ఎకరాల్లో ఖరీఫ్ సాగుకు నీరందని పరిస్థితి నెలకొంది.
రూ. లక్షలు వెచ్చించి రిపేర్లు చేసినా మళ్లీ దొంగతనాలు కావడంతో పంటలను ఎలా పండించాలో తెలియక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను గుర్తించాలని, ప్రభుత్వం ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ట్రాన్స్ఫార్మర్లు చోరీ జరిగిన ఎత్తిపోతల ప్రాంతాలు
రైతులే చూసుకోవాలి
ఎత్తిపోతల పథకాల నిర్వహణ బాధ్యతను ఆయకట్టు రైతులే చూస్తున్నారు. వాటిని వారే భద్రంగా చూసుకోవాలి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో విలువైన రాగి, ఇతర పరికరాలు చోరీకి గురికావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాం. ట్రాన్స్ఫార్మర్లను తిరిగి రైతులే సమకూర్చుకోవాలి. – ప్రవీణ్, ఇరిగేషన్ ఏఈ, నందిపేట
దర్యాపు చేస్తున్నాం
ఎత్తిపోతల పథకాల్లో వరుస చోరీలు జరుగడంపై దర్యాప్తు చేస్తున్నాం. ఎత్తిపోతల పథకాల వద్ద వాచ్మన్ను నియమించుకోవాలని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.
– చిరంజీవి, ఎస్సై, నందిపేట

నియంత్రించలేకపోతున్నారు!