
నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడి
ఇందల్వాయి/ధర్పల్లి/జక్రాన్పల్లి: నాణ్యమైన విత్తనాల వాడకం వల్లే అధిక దిగుబడి సాధించగలమని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సూచించారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మంగళవారం ఇందల్వాయి, ధర్పల్లి, జక్రాన్పల్లి మండలాలలో నాణ్యమైన విత్తనం– రైతన్నకు నేస్తం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ..నాణ్యమైన విత్తనాలతో పంట దిగుబడి 15 శాతం వరకు పెరిగే అవకాశాలుంటాయని పేర్కొన్నారు. పరిశోధన కేంద్రం ద్వారా నాణ్యమైన విత్తనాన్ని సేకరించి సాగు సాంకేతికతలను పాటిస్తే అదే విత్తనాన్ని మూడేళ్ల వరకు వాడుకోవచ్చునని సూచించారు. ప్రతి రెవెన్యూ గ్రామంలో ముగ్గురు నుంచి ఐదుగురు అభ్యుదయ రైతులకు వ్యవసాయ పరిశోధన కేంద్రం ఉత్పత్తి చేసిన విత్తనం అందిస్తామన్నారు. ఎంపికై న రైతులకు విత్తనాలు అందించారు.