ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్యాయత్నం

Jun 8 2025 1:14 AM | Updated on Jun 8 2025 1:14 AM

ఇందిర

ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్యాయత్నం

వేర్వేరు కారణాలతో ఇద్దరి ఆత్మహత్య

పంచాయతీ కార్యదర్శి హత్య

పిట్లం: చిన్నకొడప్‌గల్‌ గ్రామ పంచాయతీ కార్యదర్శి ధరావత్‌ కృష్ణ (28) అనే పంచాయతీ కార్యదర్శి హత్యకు గురయ్యా రు. స్థానికులు తెలిపి న వివరాలిలా ఉన్నాయి. రూం తండాకు చెందిన దరావత్‌ కృష్ణ చిన్నకొడప్‌గల్‌ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. దీంతో అతడి తండ్రి గోప్యానాయక్‌ శుక్రవారం పిట్లం పోలీసులకు పిర్యాదు చేశాడు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గాలింపు చేపట్టగా శనివారం చిన్నకొడప్‌గల్‌ శివారులోని రెడ్డి చెరువులో మృతదేహం లభించింది. మృతదేహాన్ని బయటకు తీసిచూడగా తలపై, శరీరంపై గాయాలు ఉన్నాయి. అతడిని హత్య చేసి చెరువు పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

చెరువులో మునిగి జాలరి మృతి

ఇందల్వాయి: మండలంలోని సిర్నాపల్లి గ్రామానికి చెందిన మత్స్యకారుడు గూండ్ల కిషన్‌(43) ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. మృగశిర కార్తే కావడంతో చేపలు వేటాడేందుకు గ్రామంలోని తుంగకుంటలోకి వెళ్లిన కిషన్‌ వలలో చిక్కుకొని నీటమునిగిపోయాడు. మృతుడికి పదేళ్లలోపు వయసున్న ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. మృతుడి భార్య శ్రావణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్‌ తెలిపారు.

ఆత్మహత్య చేసుకున్న దంపతుల అంత్యక్రియలు పూర్తి

ఖలీల్‌వాడి: ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యల కారణంగా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న నగరంలోని గాయత్రినగర్‌కు చెందిన దంపతులు శ్రీనివాస్‌(56), మమత(48) అంత్యక్రియలను శనివారం పూర్తి చేశారు. పోలీసులు మృతదేహలకు నిజామాబాద్‌లోని జీజీహెచ్‌లో పోస్టుమార్ట పూర్తి చేయించి శనివారం కుటుంబసభ్యులకు అప్పగించారు. శ్రీనివాస్‌, మమత కుమారులు ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లగా, కోడలు తల్లిగారి ఇంటికి వెళ్లి తిరిగి వచ్చే సరికి ఈ ఘటన చోటు చేసుకుందని ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

పోక్సో కేసులో ఇద్దరి రిమాండ్‌

మోపాల్‌: పోక్సో కేసులో పరారీలో ఉన్న ఇద్దరిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సురేశ్‌కుమార్‌ శనివారం తెలిపారు. మండలంలోని బైరాపూర్‌ గ్రామానికి చెందిన చక్రవర్తితోపాటు మరో బాలుడు ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఇద్దరు పరారయ్యారు. శనివారం వారిద్దరు స్వగ్రామానికి వచ్చినట్లు సమాచారం అందడంతో మోపాల్‌ ఎస్సై యాదగిరిగౌడ్‌ అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టి, రిమాండ్‌కు తరలించారు. చక్రవర్తిని సారంగాపూర్‌ జిల్లా జైలుకు, బాలుడిని బోస్టన్‌ స్కూల్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

లింగంపేట(ఎల్లారెడ్డి): ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన లింగంపేట మండలం కొర్పోల్‌ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నర్సని కాశీరామ్‌కు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని, మొదటి విడత లిస్టులో పేరు వచ్చిందని గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు తెలిపారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు కాశీరాం తాను నివాసం ఉంటున్న గుడిసెను తొలగించి స్థలం చదును చేసుకున్నాడు. ఇంటి నిర్మాణ సమయంలో డబ్బులకు ఇబ్బంది రావొద్దని ముందుగా తనకు ఉన్న 20 గుంటల వ్యవసాయ భూమిని అమ్మేశాడు. ఆ తరువాత జాబితాలో తన పేరు రాకపోవడంతో కలత చెందాడు. ఉన్న గుడిసె తొలగించడంతో ఉండడానికి ఇల్లు లేకుండా పోయిందని, తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించాలని నాయకులను వేడుకున్నాడు. ఈ క్రమంలో తీవ్రమనస్తాపానికి లోనై శనివారం మధ్యాహ్నం గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు హూటాహూటిన అతడిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

ఖలీల్‌వాడి: నగరంలోని అంబేడ్కర్‌ కాలనీకి చెందిన గాజుల రాజమణి గుండెపోటుతో మృతి చెందింది. అయితే తన అసిసెమెంట్‌ నంబర్‌తో గంగోనే రాజేశ్వర్‌ అనే వ్యక్తి తన ఇంటిని రిజస్ట్రేషన్‌ చేసుకోవడంతో తీవ్రమనస్తాపానికి గురై రాజమణి గుండెపోటుతో మృతి చెందిందని ఆమె సోదరి లలిత, కుటుంబ సభ్యులు ఆరోపించారు. రాజమణి మృతదేహంతో రాజేశ్వర్‌ ఇంటి ఎదుట ధర్నా చేశారు. రాజేశ్వర్‌ ఆరు నెలలుగా ఇంటి రిజస్ట్రేషన్‌ను రాజమణి పేరుపైకి మార్చడంలేదని, దీంతో తీవ్ర ఆందోళనకు గురైన రాజమణికి శుక్రవారం గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. పరిస్థితి విషమించి శనివారం మృతి చెందడంతో ఆమె మృతదేహంతో ధర్నా చేశారు. సమాచారం అందుకున్న టౌన్‌ సీఐ శ్రీనివాస్‌రాజు, ఎస్సై హరిబాబు ఘటనాస్థలానికి చేరుకొని ఇరు వర్గాలతో మాట్లాడారు. సోమవారం రోజున ఇంటి రిజిస్ట్రేషన్‌ మార్పు చేయించి ఇస్తానని గంగోనె రాజేశ్వర్‌ ఒప్పుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.

రాజంపేట: మండలంలోని ఆర్గోండ గ్రామానికి చెందిన రైతు జంగిటి పెంటయ్య(48) ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై పుష్పరాజ్‌, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పెంటయ్య గ్రామ శివారులోని తనుకున్న 20 గుంటల భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. యాసంగిలో జొన్న సాగు చేయగా అనుకున్న దిగుబడి రాకపోవడం, తన ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లకు చేసిన అప్పులు కూడా భారం కావడంతో మానసిక ఆందోళనకు గురయ్యేవాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం 7:30 గంటలకు పొలానికి వెళ్తున్నానని ఇంట్లో నుంచి వెళ్లిన పెంటయ్య తిరిగిరాలేదు. కొద్ది సేపటి తరువాత అదే గ్రామానికి చెందిన జంగిటి దుర్గయ్య అనే వ్యక్తి ఫోన్‌ చేసి పంట పొలంలోని చెట్టుకు పెంటయ్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. మృతుడి భార్య రాజమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

మతిస్థిమితం లేని వ్యక్తి..

ఇల్లు రిజిస్ట్రేషన్‌ చేయడం లేదని ఆవేదన.. గుండెపోటుతో మహిళ మృతి

భిక్కనూరు: మండలంలోని మల్లుపల్లి గ్రామానికి చెందిన ఆకారపు స్వామి(39) అనే వ్యక్తి మతిస్థిమితం లేక ఆత్మహత్య చేసుకున్నట్లు భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. భార్య సంధ్యతో కలిసి ఐదేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్న స్వామికి గత కొన్ని నెలలుగా మతిస్థిమితం సరిగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రుల్లో చిక్తిస చేయించారు. స్వామి గత నెల29వ తేదీన హైదరాబాద్‌ నుంచి మల్లుపల్లికి వచ్చిన స్వామి పురుగుల మందు తాగాడు. కుటుంబీకులు వెంటనే అతడిని ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి అక్కడి నుంచి సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి శనివారం ఉదయం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్యాయత్నం1
1/3

ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్యాయత్నం

ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్యాయత్నం2
2/3

ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్యాయత్నం

ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్యాయత్నం3
3/3

ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్యాయత్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement