
సన్నాలకు దిక్కెవరు?
● మోర్తాడ్కు చెందిన రైతు మెండె దాసు తన పొలంలో పండించిన సన్నరకం వరి ధా న్యం 50 క్వింటాళ్లను స్థానికంగా ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రానికి తరలించాడు. 15 రోజులవుతున్నా ఆ ధాన్యాన్ని మిల్లుకు తరలించలేకపోతున్నారు. ఇదేమిటని రైతు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ప్రశ్నిస్తే మిల్లర్లు సన్నరకాలను తీసుకోవడం లేదనే సమాధానం వచ్చింది. ఇది ఒక్క రైతు మెండె దాసుకు ఎదురైన చేదు అనుభవమే కాదు. సన్నరకం వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించిన ఎంతో మంది రైతులకు తప్పనిఇబ్బంది.
మోర్తాడ్(బాల్కొండ) : సన్నరకం వడ్లు పండించిన రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొనుగోలు కేంద్రాల నుంచి వెళ్లిన ధాన్యాన్ని మిల్లర్లు తీసుకునేందుకు ససేమిరా అంటున్నారు. ఖరీఫ్ సీజన్లో సన్న రకం ధాన్యం క్వింటాలుకు ప్రభుత్వం రూ.500 ల బోనస్ ఇవ్వడంతో యాసంగిలోనూ అదే ఉత్సాహంతో రైతులు సన్నరకాలు సాగు చేశారు. అయితే, యాసంగి సీజన్లో పండించిన సన్నరకం వడ్లను మిల్లింగ్ చేస్తే ఎక్కువ శాతం నూక వస్తుందనే కారణంతో మిల్లర్లు వెనుకడుగు వేస్తున్నారు. ప్రభుత్వం అందించిన ప్రోత్సాహకంతో ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా రైతులు 70శాతానికి పైగా సన్నరకాలను సాగు చేశారు. కాగా, మోర్తాడ్, ఏర్గట్ల, కమ్మర్పల్లి, భీమ్గల్, వేల్పూర్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా తదితర మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ప్రస్తుతం సన్నరకం వడ్లు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి.
క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితి
సన్నరకాలను సేకరించే విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని అధికార యంత్రాంగం చెబుతోంది. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం సన్నరకాలను కొనుగోలు చేయలేక నిర్వాహకులు చేతులు ఎత్తివేసిన పరిస్థితి కనిపిస్తోంది. మోర్తాడ్ సహకార సంఘం ఆధ్వర్యంలో సేకరించిన సన్నరకం వరి ధాన్యాన్ని వేల్పూర్ మండలం పచ్చలనడ్కుడ రైస్మిల్లుకు ఇటీవల తరలించారు. అక్కడ యజమాని సన్నరకం వడ్లను దించుకోకపోవడంతో సహకార సంఘం ఉద్యోగులు అంకాపూర్ మిల్లుకు తరలించారు. ఇదే విషయాన్ని అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్తే సన్నరకాలను కచ్చితంగా దించుకుంటారని, ఎలాంటి సమస్య ఉండదని చెబుతున్నారు. అధికారులు చెప్పే మాటలకు క్షేత్రస్థాయి పరిస్థితులు విరుద్ధంగా ఉండడం గమనార్హం. ఉన్నతాధికారులు స్పందించి సన్నరకాలను మిల్లర్లు సేకరించేలా పక్కాగా ఆదేశాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
వడ్లు దించుకోవడానికి
అంగీకరించని మిల్లర్లు
దొడ్డు రకాలే తీసుకుంటామని
స్పష్టం చేస్తున్న వైనం
రోజుల తరబడి కొనుగోలు
కేంద్రాల్లోనే ధాన్యం