
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత
ఇందల్వాయి: మండలంలోని లింగాపూర్ వాగు నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను గురువారం పట్టుకొని పీఎస్కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. పాటితండాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో వెంటనే వాగులో తనిఖీలు చేపట్టి వారిని పట్టుకున్నట్లు చెప్పారు. గ్రామాల్లో ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మోపాల్లో..
మోపాల్: మండలంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న బదావత్ మోహన్కు చెందిన ట్రాక్టర్ను పట్టుకున్నట్లు ఎస్సై యాదగిరిగౌడ్ గురువారం తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నారని సమాచారం రావడంతో ట్రాక్టర్ను పట్టుకొని పీఎస్కు తరలించినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం.. ఆయిల్ చోరీ
నవీపేట: మండలంలోని నిజాంపూర్ ఎత్తిపోతల పథకానికి చెందిన ట్రాన్స్ఫార్మర్ను దుండగులు బుధవారం రాత్రి ధ్వంసం చేసినట్లు ఎస్సై వినయ్ గురువారం తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి అందులోని కాపర్ కాయిల్స్, ఆయిల్ను ఎత్తు కెళ్లారని పేర్కొన్నారు. రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి
మాక్లూర్: గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన మాక్లూర్ మండలం వెంకటాపూర్లో శివారులో చోటు చేసుకుంది. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆలూర్ మండలం ఢీకంపల్లి గ్రామానికి చెందిన తంబాకు గౌరి(44), తంబాకు సాయిలు భార్యాభర్తలు. వీరు బోధన్ మండలం అమ్దాపూర్లో గురువారం నిర్వహించిన బంధువుల అంత్యక్రియలకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి బైక్పై వస్తుండగా వెంకటాపూర్ శివారులో ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొన్నది. ఈ ఘటనలో గౌరి పై నుంచి వాహనం వెళ్లడంతో ఆమె ఘటన స్థలిలోనే మృతి చెందింది. సాయిలుకు హెల్మెట్ ఉండడంతో స్వల్పగాయాలతో బయటపడ్డాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గతంలోనే ఈ రోడ్డు గుండా అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ‘సాక్షి’ పలుమార్లు కథనాలు ప్రచురించింది. అధికారుల్లో మాత్రం స్పందన కరువవుతోంది. ఈ రోడ్డు గుండా అనేక మూలమలుపులు ఉన్నాయి. కనీసం సూచిక బోర్డులు సైతం లేకపోవడంతో పలువురు వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పేకాట స్థావరంపై దాడి
సిరికొండ: మండలంలోని చిన్నవాల్గోట్ శివారులో పేకాట స్థావరంపై దాడి చేసి ఏడుగురిని గురువారం పట్టుకున్నట్లు ఎస్సై ఎల్ రామ్ తెలిపారు. వారి నుంచి రూ. 5,250 నగదు, ఐదు బైకులు, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత