సుభాష్నగర్: వినియోగదారుల హక్కుల పరిరక్షణకు అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో పౌర సరఫరాల శాఖ, సివిల్ సప్లైస్ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై వినియోగదారుల హక్కులు, బాధ్యతలను తెలియజేస్తూ, చట్ట పరిధిలో ఎలాంటి సేవలు పొందవచ్చు, వస్తు, సేవలలో మోసాలు ఎదురైనప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలి.. పలు అంశాలపై వినియోగదారులను చైతన్యపర్చే కార్యక్రమాలు నిర్వహించాలని వినియోగదారుల సంఘాలకు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వస్తువుల నాణ్యత, వాటి ప్రమాణాల గుర్తింపు, తదితర అంశాలపై వినియోగదారులకు అవగాహన ఉన్నప్పుడే, నాసిరకం, నాణ్యతా లోపాలను గుర్తించి తమ హక్కులకు ఫిర్యాదు చేస్తారన్నారు. ఏదైనా సందర్భంలో మోసాలకు గురైతే న్యాయం పొందేందుకు వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టాలు దోహదపడతాయని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు వినియోగదారులకు వారి హక్కులు, బాధ్యతల పట్ల అవగాహన పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. నేటి రోజుల్లో అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యమైన వస్తువులు, సేవలను గుర్తించేందుకు గల అవకాశాలను తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో వినియోగదారుల ఫోరం ప్రతినిధి రాజేశ్వర్, అధికారులు, వినియోగదారుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.