వివాదాలు.. విచారణలు | - | Sakshi
Sakshi News home page

వివాదాలు.. విచారణలు

Jan 30 2025 1:41 AM | Updated on Jan 30 2025 1:41 AM

వివాదాలు.. విచారణలు

వివాదాలు.. విచారణలు

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లా విద్యాశాఖ రోజురోజు కూ వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోంది. వివాదాలు.. విచారణల చుట్టూ ఉన్నతాధికారులు తిరుగుతుండడంతో విద్యాబోధన గాడి తప్పుతోంది. పలుచోట్ల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులకు మధ్య వివాదాలు నెలకొనగా, మరికొన్ని చోట్ల సమయపాలన, పాఠ్యాంశాల బోధనను పట్టించుకునే వారు కరువయ్యారు. ప్రతిరోజూ ఏదో ఒక వివా దం జరగడం, ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. ఫిర్యాదులపై విచారణ చేపడుతున్న ఉన్నతాధికారులు విద్యావ్యవస్థను గాడిలో పెట్టడంపై దృష్టి సారించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పలువురు హెచ్‌ఎంల వ్యవహారశైలి ఇప్పటికే వివాదాస్పదం కాగా, మరికొందరు స్కా వెంజర్ల వేతనాలను మింగేస్తున్నారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొన్ని ప్రాంతాల్లో అసలు ప్రారంభంకాకపోవడం గమనార్హం.

● ధర్పల్లి ఉన్నత పాఠశాల హెచ్‌ఎంపై గ్రామస్తులతోపాటు టీచర్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి బి య్యం నిల్వల లెక్కలు లేకపోవడం, టీచర్లను వేధించడం, హెచ్‌ఎం భర్త విద్యాబోధనలో జోక్యం చేసుకోవడం వంటి అనేక వివాదాలు ఉన్నాయి. దీనిపై ఎంఈవో విచారణ చేపట్టి పాఠశాల ఆర్జేడీకి ఫిర్యా దు చేయగా హెచ్‌ఎంపై ఇటీవలే సస్పెన్షన్‌ వేటు పడింది.

● తమను అనవసరంగా తిట్టడంతోపాటు సెలవుల విషయంలో వేధిస్తున్నారని ధర్పల్లి మండలంలోని దుబ్బా పాఠశాల హెచ్‌ఎంపై టీచర్లు జిల్లా విద్యాశాఖ అధికారికి, ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పాఠశాల గ్రాంట్‌ నిధులు వినియోగించకపోవడం, సరైన లెక్క చూపకపోవడం వంటి ఆరోపణలున్నాయి. ఓ విద్యార్థి తన కుర్చీకి దూల కాయ పెట్టగా తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎంఈవో, డీఈవోకు టీచర్లపై హెచ్‌ఎం ఫిర్యాదు చేసింది. విద్యార్థులు ఇటీవల టూర్‌ వెళ్లేందుకు హెచ్‌ఎం అనుమతించకపోవడంతో గ్రామస్తులు అనుమతి పత్రం ఇచ్చారు. దీంతో టీచర్లు విద్యార్థులను టూర్‌కు తీసుకెళ్లారు. దీనిపై హెచ్‌ఎం సీరియస్‌ అయ్యి టీచర్లపై మండిపడింది.

● బాల్కొండ మండలంలోని మరో ప్రధాన ఉపాధ్యాయుడు పాఠశాల గ్రాంట్‌ను సరైన నివేదిక లేకుండా ఖర్చు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ కొనసాగుతోంది.

● వర్ని మండలంలోని ఓ హెచ్‌ఎం ప్రాథమిక పాఠశాలకు సంబంధించి సామగ్రిని అనుమతి లేకుండా విక్రయించి ఆ డబ్బులను కాజేశాడు.

నామమాత్రంగా ప్రత్యేక తరగతులు

వార్షిక పరీక్షలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. కానీ జిల్లాలోని చాలా చోట్ల ప్రత్యేక తరగతులు అటకెక్కాయి. జిల్లా కేంద్రానికి దగ్గర ప్రాంతంలో తరగతులు కొనసాగుతుండగా సరిహద్దు ప్రాంతాల్లో అసలు నిర్వహించడం లేదు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో విద్యాబోధన అటకెక్కింది. సమయపాలనను పట్టించుకునే వారు లేకుండాపోయారు.

హెచ్‌ఎంల జేబుల్లోకి స్కావెంజర్ల వేతనాలు

పలు పాఠశాలల హెచ్‌ఎంలు స్కావెంజర్ల వేతనాలను తమ జేబుల్లో వేసుకుంటున్నారు. వర్ని మండలం ఎస్‌ఎన్‌ పురంలో స్కావెంజర్‌కు హెచ్‌ఎం గత కొన్ని నెలలుగా డబ్బులు ఇవ్వడం లేదు. స్కావెంజర్‌ వేతనం అడిగితే.. రావడం లేదని, ఇష్టం లేకపోతే పనిమానేయాలని దబాయిస్తున్నాడు. దీంతో అక్కడి స్కావెంజర్‌ వీడీసీ ఇచ్చే రూ.2 వేలతోనే నెట్టుకొస్తున్నాడు. ధర్పల్లి మండల కేంద్రంలో స్కావెంజర్‌కు గత కొన్ని నెలలుగా వేతనం ఇవ్వకపోవడంతో విచారణ చేపట్టిన అధికారులు చర్యలు తీసుకున్నారు. నవీపేట మండలంలో ఓ హెచ్‌ఎం కూడా స్కావెంజర్‌ డబ్బులు వాడుకుంటున్నారు. పాఠశాలలో ముగ్గురు స్కావెంజర్లు ఉన్నట్లు వేతనాలు మంజూరవుతుండగా, ఇక్కడ ఒక్కరు మాత్రమే పని చేస్తున్నారు.

గాడితప్పిన విద్యాశాఖ

స్కావెంజర్ల వేతనాలు మింగేస్తున్న

కొందరు హెచ్‌ఎంలు

ప్రత్యేక తరగతులపై పర్యవేక్షణ కరువు

పర్యవేక్షిస్తాం

పాఠశాలల పర్యవేక్షణను పకడ్బందీగా చేపడతాం. ఎక్కడ కూడా లోపాలు లేకుండా చూస్తాం, ఇటీవల కొన్ని ఘటనలపై ఫిర్యాదులు అందడంతో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకున్నాం. ఎక్కడా వివాదాలు చోటుచేసుకోకుండా చూస్తాం.

– అశోక్‌, డీఈవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement