
మై ఓటర్ హెల్ప్లైన్ యాప్
బాన్సువాడ: ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా వినియోగించి ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది. గతంతో పోలిస్తే ఈ సారి ఎన్నికలు మరిన్ని కొత్త పద్ధతులు, విధానాలను ఎన్నికల సంఘం ప్రవేశపెడుతోంది.
సీ విజిల్కు మరింత పదును
ఎన్నికల్లో నిర్వహించే అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు 2014లో ఎన్నికల సంఘం సీ విజిల్ యాప్ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దీన్ని ఆధునికీకరించడంతో పాటు ఎఫ్ఎస్టీతో అనుసంధానం చేసింది. అక్రమానికి సంబంధించిన ఫొటోను యాప్లో అప్లోడ్ చేస్తే వంద నిమిషాల వ్యవధిలో అధికారులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టి ఫిర్యాదుదారుకు సమాచారం ఇస్తారు. ఫిర్యాదు సమాచారం జిల్లా ఎన్నికల అధికారితో పాటు నియోజకవర్గ పరిధిలోని ఫ్లయింగ్ స్క్వాడ్కు చేరుతుంది.
ఈవీఎంలపై అభ్యర్థుల ఫొటోలు
తమ అభ్యర్థిని గుర్తించేందుకు వీలుగా ఎన్నికల సంఘం ఈవీఎంలలో స్వల్ప మార్పులు చేసింది. గతంలో ఓటింగ్ యంత్రాలపై పార్టీ గుర్తు, అభ్యర్థి పేరు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం నిర్వహించే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఫొటోలు కూడా పెట్టనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. పోస్టల్ బ్యాలెట్పైన ముద్రించేందుకు చర్యలు చేపట్టింది.
మై ఓటర్ హెల్ప్లైన్ యాప్
గతంలో ఓటర్లకు తమ ఓటు ఏ కేంద్రంలో ఉందో తెలియకపోవడం, కుటుంబ సభ్యుల ఓట్లు వేర్వేరు చోట్ల ఉండడంతో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతున్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ నేపథ్యంలో మై ఓటర్ హెల్ప్లైన్ యాప్ ప్రవేశపెట్టింది. ఈ యాప్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని ఓటరు కార్డు ఎఫిక్ నంబర్ అందులో నమోదు చేస్తే ఏ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసే అవకాశం ఉందో తెలుస్తుంది.
ముందే పోస్టల్ ఓటింగ్
ఎన్నికల ప్రక్రియలో భాగస్వాయులయ్యే అఽధికారులు, సిబ్బంది ఈ దఫా పోలింగ్ ప్రక్రియ ప్రారంభించడానికి ముందుగానే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించారు. గతంలో పోస్టల్ బ్యాలెట్లను ఎన్నికల విధులకు హాజరయ్యే సమయంలో వేసేందుకు అవకాశం ఉండేది.
యూత్ పోలింగ్ కేంద్రాలు
మహిళలు, దివ్యాంగుల ఓటు శాతం పెంపొందించే ఉద్దేశంతో గతంలో వీరికి ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో యువ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో యూత్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. వీటిని యువ అధికారులే నిర్వహించనున్నారు. మొదటి సారి నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్నారు.
అకౌంటింగ్ బృందాల ఏర్పాటు
ఎన్నికల సమయంలో వ్యయ నియంత్రణ అనేది లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో ఖర్చులను కట్టడి చేసేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో మొదటిసారి నియోజకవర్గానికో అకౌంటింగ్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల వ్యయ పరిశీలనకు 15 రోజులకొకసారి వివరాలు అందించాల్సి ఉండేది. ప్రస్తుతం ప్రచారంతో పాటు ఇతరత్రా కార్యక్రమాలు చేస్తున్న వ్యయాన్ని పరోక్షంగా అకౌంటింగ్ బృందాలు పరిశీలించనున్నాయి.
ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక చర్యలు
పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యం