
రైతుల పాదయాత్ర షురూ..
భైంసా: జిల్లాలో సోయా కొనుగోలు కేంద్రాల ప్రారంభించాలని కోరుతూ భారత్ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులు మంగళవారం పాదయాత్ర ప్రారంభించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి రైతులతో కలిసి బాసర సరస్వతీ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం పాదయాత్రగా కదులుతూ రోడ్డు పక్కనే కుప్పలుగా వేసిన సోయా కల్లాలపై వెళ్లి రైతులతో మాట్లాడారు. పంట కోసి నెలరోజులైనా కేంద్రాలు తెరవలేదని కురుస్తున్న వర్షాలతో ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోయా రైతులను ఓదారుస్తూ పాదయాత్ర లో ముందుకు వెళ్లారు. బిద్రెల్లి టాక్లి ముధోల్ పంట శివారులో భారీ వర్షాలతో నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా వ్యవసాయ అధికారులు పంట క్షేత్రాలు పరిశీలించిన ఇప్పటివరకు పరిహారం ఇప్పించలేకపోయారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
కొనుగోలు కేంద్రాలు కరువు..
కొనుగోలు కేంద్రాల ప్రారంభం కోరుతూ, భారీ వర్షంతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర ప్రారంభించినట్లు భారతీయ కిసాన్ సంఘ సభ్యులు తెలిపారు. ప్రభుత్వం ప్రైవేట్ మాఫియాను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. పంటలు కోయడానికి కూలీల కొరత తీవ్రంగా ఉందని ఇప్పటికే రేటు లేక రైతులు ఇబ్బంది పడుతుండగా, కొనుగోలు కేంద్రాలు లేకపోవడం మరింత భారమైందని పాదయాత్రలో రైతులు చెబుతున్నారు.
నేడు సబ్ కలెక్టర్కు వినతి
బాసర నుంచి ప్రారంభమైన యాత్ర ముధోల్కు చేరుకుంది. రెండోరోజు బుధవారం భైంసా వరకు కొనసాగనుంది. సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం ఇవ్వనున్నారు. సోయా పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలని, భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని నాయకులు కోరనున్నారు.