
సామాన్యులకు అండగా పోలీసులు
నిర్మల్టౌన్: పోలీసులు సామాన్యులకు అండగా ఉండాలని పోలీసు అధికారులకు ఎస్పీ జానకీషర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలను తెలుసుకుని సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సామాన్యులకు అండగా ఉండాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నాణ్యమైన పోలీసు వ్యవస్థను జిల్లా ప్రజలకు అందించడమే లక్ష్యమన్నారు. పోలీసుల సహాయం కావాలనుకునేవారు నేరుగా ఠాణాలో ఫిర్యాదు చేయాలని తెలిపారు.