జీవాలకు వ్యాక్సినేషన్‌ | - | Sakshi
Sakshi News home page

జీవాలకు వ్యాక్సినేషన్‌

Aug 25 2025 8:53 AM | Updated on Aug 25 2025 8:53 AM

జీవాలకు వ్యాక్సినేషన్‌

జీవాలకు వ్యాక్సినేషన్‌

● ఈనెల 26నుంచి 10వరకు టీకాలు ● మండలానికో బృందం నియామకం

వ్యాధి లక్షణాలు

వ్యాధి సోకిన గొర్రెలు, మేకల్లో అధిక జ్వరం రావడం.. కళ్లు, ముక్కు నుంచి నీరు కారడం, నోటిలో పొక్కులు ఏర్పడి జిగురుతో కూడిన విరోచనాలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే దీన్ని పారుడు వ్యాధి అంటారు. ఈ వ్యాధి ముదిరినప్పుడు ముక్కు నుంచి చీము కారడం, నోటిలోని చిగుళ్లు, నాలుకపై పుండ్లు ఏర్పడతాయి. వ్యాధి సోకిన జీవాలు ఆకలి మందగించి మేత తినకపోవడం, విరోచనాలు, దగ్గు లాంటి లక్షణాలతో 5నుంచి 10రోజుల్లో మరణిస్తాయి.

నిర్మల్‌చైన్‌గేట్‌: మేకలు, గొర్రెలకు పీపీఆర్‌ (పెస్టిడీస్‌ పైటెటిస్‌ రూమి నాంట్స్‌) వ్యాధి నిరోధక టీకా లు వేయనున్నారు. జిల్లా పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 26నుంచి సెప్టెంబర్‌ 10వరకు జి ల్లాలోని అన్ని గ్రామాల్లో గొర్రెలు, మేకలకు టీకాలు వేసే ఏర్పాట్లు చేశారు. ఇందుకు అవసరమైన బృందాలను ఏర్పాటు చేసి వ్యాక్సిన్‌ సిద్ధంగా ఉంచారు. ఉన్నతాధికారులు అన్ని పశువైద్యశాలలు, సబ్‌ సెంటర్లు, ప్రాథమిక, పశువైద్య కేంద్రాలకు వ్యాక్సిన్‌ పంపుతున్నారు. ఆయా బృందాలు ఉదయం 7గంటలకే గ్రామాలకు చేరుకుని మధ్యాహ్నం 12గంట ల వరకు గొర్రెలు, మేకలకు టీకాలు వేస్తారు.

వ్యాప్తి చెందే విధానం

గొర్రెలు, మేకల్లో మారిబిల్లివైరస్‌తో పీపీఆర్‌ అనే అంటువ్యాధి సోకుతుంది. ఇది జీవాలకు సరైన గా లి, వెలుతురు అందకపోవడం, కలుషిత ఆహారం, నీరు తీసుకోవడంతోపాటు వర్షాల కారణంగానూ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకిన జీవాలు మందలో ఉంటే మిగతావాటికి ఇది సోకుతుంది. వ్యాధి వచ్చిన జీవాలు విసర్జించే పేడ, స్రవాల ద్వారా ఇది ఇతర జీవాలకు వ్యాపిస్తుంది.

నిర్ధారణ, చికిత్స ఇలా..

చనిపోయిన జీవాల శవపరీక్ష చేసినప్పుడు చిన్న పేగులు, పెద్ద పేగుల్లో రక్తపు చారలు కనిపించడం ద్వారా శ్వాసకోశ, జీర్ణావస్థకు సంబంధించిన లక్షణాల ద్వారా వ్యాధిని గుర్తించవచ్చు. ఈ వ్యాధికి సరైన చికిత్స లేదు. వ్యాధిని ముందుగా గుర్తించి పశువైద్యులతో చికిత్స అందిస్తే జీవాలను కాపాడుకోవచ్చు. పశువైద్యుడి సలహా మేరకు వ్యాధి లక్షణాలకు తగినట్లు యాంటి బయాటిక్‌ మందులు వాడుకోవాలి. నోటి పుండ్లు తగ్గడానికి బోరిక్‌ యాసిడ్‌ కలిపిన గ్లిజరిన్‌ పూయాలి. మేత మేయని జీవాలను గుర్తించి వాటికి జావ, అంబలి తాగించాలని పశువైద్యులు సూచిస్తున్నారు.

సద్వినియోగం చేసుకోవాలి

జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఈ నెల 26నుంచి సెప్టెంబర్‌ 10వరకు పీపీఆర్‌ టీకాలు వేయనున్నాం. గొర్రెల, మేకల పెంపకందారులు తమ గొర్రెలు, మేకలకు టీకాలను విధిగా వేయించుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

– రాజేశ్వర్‌, జిల్లా పశువైద్యాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement