
విద్యార్థుల సంఖ్య పెంచాలి
● ఇన్చార్జి డీఈవో పరమేశ్వర్
నిర్మల్ రూరల్/సోన్: పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపునకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఇన్చార్జి డీఈవో పరమేశ్వర్ సూచించారు. పోషకుల సమావేశంలో భాగంగా నిర్మల్ రూరల్ మండలం ముఠాపూర్ ప్రాథమిక పాఠశాలలో, సోన్ మండలం న్యూవెల్మల్ బొప్పారం ఉన్నత పాఠశాలలో వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో శుక్రవారం మాట్లాడారు. ప్రభుత్వ బడుల్లో పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, ఏకరూప దుస్తులు ఉచితంగా అందజేస్తామన్నారు. ప్రతీరోజు ఉదయం రాగిజావ, మధ్యాహ్నం భోజనం కూడా అందిస్తామన్నారు. ప్రాథమిక పాఠశాల దశ నుంచి విద్యార్థులకు కంప్యూటర్పై అవగాహన కల్పించబడుతున్నదని, ఈ సంవత్సరం నుంచి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విద్యా బోధన కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విశాలమైన తరగతి గదులు, ఆట స్థలాలతో పాటు డిజిటల్ తరగతి గదులు, లైబ్రరీ, ల్యాబ్లు ఉన్నాయని వివరించారు. పాఠశాలలను బలోపేతం చేయాల్సిన బాధ్యత గ్రామ వీడీసీలతోపాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులపై ఉందన్నారు. పాఠశాల హెచ్ఎంలు సుధాకర్, విద్యాసాగర్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ గోదావరి,ఉపాధ్యాయులు, గ్రామస్తులు, పోషకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
లక్ష్మణచాంద: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంట అశోక్ తెలిపారు. టీఎస్ యూటీఎఫ్ ప్రచార జాతలో భాగంగా మండల కేంద్రంలో ఉపాధ్యాయులతో శుక్రవారం ప్రచారం చేపట్టారు. అన్ని రకాల అర్హతలు కలిగిన, అంకిత భావంతో పనిచే ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారని, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యాబోధధన చేస్తానని వివరించారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని పోషకులను కోరారు.