
బుద్ధ విగ్రహం తొలగింపుపై నిరసన
● భైంసా–బాసర జాతీయ రహదారిపై అంబేడ్కర్ వాదుల ఆందోళన ● బోరిగాం ఘటనపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్
ముధోల్ : ముధోల్ మండలం బోరిగాం గ్రామంలో ఇటీవల బుద్ధుని విగ్రహం తొలగింపు ఘటనపై దళిత సంఘాలు, అంబేడ్కర్వాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. న్యాయం కోరుతూ శుక్రవారం ముధోల్ మండల కేంద్రంలో భైంసా–బాసర జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు నిరసనలో పాల్గొన్నారు. రాస్తారోకో కారణంగా జాతీయ రహదారిపై సుమారు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. బుద్ధుని విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు కలెక్టర్ హామీ ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సుమారు 5 గంటలపాటు ఆందోళన చేశారు. ప్రభుత్వ స్థలంలో ప్రతిష్టించిన బుద్ధుని విగ్రహంపై దాడులు జరగడం బాధించిందని పలువురు పేర్కొన్నారు. న్యాయం చేయాల్సిన అధికారులు మొండి వైఖరి అవలంబిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారుల హామీతో..
ఎస్పీ జానకీ షర్మిల శాంతియుతంగా చర్యలు చేపడతామని చెప్పినానిరసనకారులు కలెక్టర్ నుంచి స్పష్టమైన హామీ కోరారు. ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్కతో చర్చలు జరిపారు. మంత్రి సంబంధిత అధికారులకు బుద్ధ విగ్రహం పునఃప్రతిష్టకు స్థలం కేటాయించాలని ఆదేశించారని విఠల్రెడ్డి, ఆర్డీవో కోమల్రెడ్డి తెలిపారు. రాబోయే సోమవారం బుద్ధ విగ్రహం ఆవిష్కరణ, బౌద్ధ పతాక ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందని, ప్రభుత్వమే కాంస్య విగ్రహం నిర్మించి అందిస్తుందని హామీ ఇచ్చారు.
పోలీసుల నిఘా
మండలంలోని బోరిగాం గ్రామంలో ఉద్రిక్తతల దృష్ట్యా శుక్రవారం పోలీసులు నిఘా పటిష్టం చేశారు. దళిత సంఘాలు శుక్రవారం చలో బోరిగాంకు పిలుపునిచ్చారు. దీంతో ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా ఎస్పీ జానకీషర్మిల ఆదేశాల మేరకు భైంసా ఏఎస్పీ అవినాష్కుమార్, అడ్మిన్ అడిషనల్ ఎస్పీ ఉపేంద్రారెడ్డి బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల నుంచి దళిత నాయకులు అధిక సంఖ్యలో తరలివస్తారని సమాచారం మేరకు ఉదయం నుండే పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు. బారీకేడ్లు ఏర్పాటు చేశారు. తనిఖీలు నిర్వహించారు. సుమారు 150 మంది పోలీసు సిబ్బందితో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. బందోబస్తును ఎస్పీ జానకీషర్మిల పర్యవేక్షించారు. గ్రామంలో ఉండి భద్రతను స్వయంగా పర్యవేక్షించారు.

బుద్ధ విగ్రహం తొలగింపుపై నిరసన