
ధాన్యం తరలించాలని రైతుల ఆందోళన
నర్సాపూర్(జి): ఆరుగాలం కష్టపడి పండించిన ధా న్యాన్ని అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. మండలంలోని తురాటి గ్రామ ఎక్స్రోడ్ వద్ద 61వ జాతీయ రహదారిపై శుక్రవారం రైతులు ధర్నా చేపట్టారు. ఈనెల 27న డొంగుర్గాం పీఏసీ ఎస్ కొనుగోలు కేంద్రం ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన గొర్ల ప్రవీణ్కు చెందిన 1100 బస్తాల ధాన్యాన్ని ఒక లారీ, 4 ట్రాక్టర్లలో మామడ, కుంటాల, వానల్పాడ్, భైంసా రైస్ మిల్లులకు పంపారు. తేమశాతం సరిగా లేదనే కారణంతో మిల్లర్లు వాటి ని గురువారం వెనక్కి పంపించారు. గురువారం రాత్రి వర్షం కురవడంతో మళ్లీ ధాన్యం తడిసింది. దీంతో శుక్రవారం రైతులు రోడ్డెక్కి నిరసనకు దిగారు. ఒకవైపు తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నారని, మిల్లర్లు మాత్రం తిప్పి పంపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్రీకాంత్, ఎస్సై సాయికిరణ్ సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. సుమారు గంటపాటు రైతులు రాస్తారోకో చేపట్టడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అనంతరం రైతులు తహసీల్దార్ శ్రీకాంత్కు వినతిపత్రం అందించి సమస్య పరిష్కరించాలని కోరారు.