
రైతన్నా.. జాగ్రత్త!
అప్రమత్తంగా ఉండాలి..
నకిలీ విత్తనాల సమస్య నుంచి రైతులను కాపాడేందుకు అధికారులు తనిఖీలను ముమ్మరం చేయాలని, అదే సమయంలో రైతులకు నాణ్యతా విత్తనాల గుర్తింపుపై అవగాహన కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. రైతులు కూడా బ్రాండెడ్, ధ్రువీకరించిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని, తక్కువ ధరలకు ఆకర్షితులై నాన్బ్రాండెడ్ విత్తనాలను కొనకుండా జాగ్రత్త వహించాలని సలహా ఇస్తున్నారు.
భైంసాటౌన్: మార్కెట్లో నకిలీ విత్తనాల విక్రయాలు రైతులకు, వ్యవసాయ రంగానికి పెను సవాల్గా మారుతున్నాయి. ఏటా ఏప్రిల్, మే నెలల్లో ఈ విక్రయాలు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నాయి. పేరు తెలియని, నాసిరకం విత్తనాల కారణంగా పంట మొలకెత్తక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సమస్యను అరికట్టేందుకు ప్రభుత్వం విత్తన దుకాణాల్లో తనిఖీలు చేపడుతున్నప్పటికీ, ఫలితాలు సంతృప్తికరంగా లేవన్న విమర్శలు వస్తున్నాయి.
నాన్బ్రాండెడ్ విత్తనాల వల..
ఈ సీజన్లో వర్షాలు ముందుగానే ప్రారంభం కావడంతో రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. దీంతో మార్కెట్లో విత్తనాల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. అయితే, ఇదే అదునుగా కొందరు వ్యాపారులు నాన్బ్రాండెడ్, నకిలీ విత్తనాలను తక్కువ ధరకు అమ్ముతూ రైతులను మోసం చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలో పత్తి, సోయా, వరి విత్తనాల్లో నాన్బ్రాండెడ్ రకాలు ఎక్కువగా చెలామణి అవుతున్నాయి. అనధికార మార్కెట్ ద్వారా ఈ విత్తనాలు విక్రయిస్తున్నారు.
తనిఖీలు నామమాత్రమేనా?
నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రభుత్వం వ్య వసాయ, పోలీసు, రెవెన్యూ, సీడ్ కార్పొరేషన్ శా ఖలతో కూడిన టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పా టు చేసింది. ఈ బృందాలు విత్తన దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తూ, నకిలీ విత్తనాల విక్రయాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాయి. అయినా ఈ తనిఖీలు నామమాత్రంగా జరుగుతున్నాయని, వ్యవసాయ శాఖ అధికారులు కొందరు డీలర్లతో లోలోపలి సంబంధాలు కలిగి ఉండడం వల్ల తనిఖీలు పూర్తిస్థాయిలో జరగడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.
మార్కెట్లో నకిలీ విత్తనాల బెడద
అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు
చర్యలు తీసుకుంటాం...
ప్రభుత్వ ఆదేశాలతో విత్తన దుకాణాల్లో తనిఖీలు చేపడుతున్నాం. స్టాక్ నిల్వలు, రిజిస్టర్లు పరిశీలిస్తున్నాం. ఎవరైనా నకిలీ, నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తాం. గడువు ముగిసిన క్రిమిసంహారక మందులు విక్రయించొద్దు.
– కోమల్రెడ్డి, ఆర్డీవో, భైంసా
భైంసాలోని ఓ దుకాణంలో విత్తనాలు కొనుగోలు చేస్తున్న రైతులు