
బడిబాట లక్ష్యం పెంచాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్
సారంగపూర్: బడిబాట కార్యక్రమం ద్వారా గతేడాదికన్నా అధికంగా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని, లక్ష్యాన్ని మించి అడ్మిషన్లు చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. మండలంలోని యాకర్పెల్లి గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని శుక్రవారం పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మండల వ్యాప్తంగా ఎంతమంది విద్యార్థులను చేర్పించారని ఎంఈవో మధుసూదన్ను అడిగి తెలుసుకున్నారు. గతేడాది 6వేల పైచిలుకు విద్యార్థుల లక్ష్యం చేర్చుకున్నామని తెలిపారు. ఈసారి లక్ష్యాన్ని అధిగమించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిశోర్కుమార్, తహశీల్దార్ శ్రీదేవి, ఎంపీవో అజీజ్ఖాన్, ఆయా గ్రామపంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు.
రైతుల సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు
అపరిష్కృతంగా ఉన్న భూముల సమస్యలను పరిష్కరించేందుకే గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలి పారు. యాకర్పల్లి గ్రామంలో నిర్వహించిన రెవె న్యూ సదస్సును అదనపు కలెక్టర్ కిశోర్కుమార్తో కలిసి పరిశీలించారు. మొత్తం 36 దరఖాస్తులు రా గా అందులో 19 దరఖాస్తులు కేవలం 241సర్వే నంబర్పైనే రావడంతో ఇదేంటని తహసీల్దార్ శ్రీదేవిని అడిగారు. తహసీల్దార్ బదులిస్తూ 241సర్వే నంబరు ప్రభుత్వ భూమి అని కలెక్టర్కు వివరించారు. దీని విస్తీర్ణం 40.36 ఎకరాలని తెలిపారు. ఇదే సర్వే నంబరులో అసైన్డ్ పట్టాలు 40.36 ఎకరాలు ఇవ్వాల్సి ఉండగా 77.17 ఎకరాలకు పట్టాలు జారీ చేశారని పేర్కొన్నారు. దీంతో ఆశ్చర్యపోయిన కలెక్టర్ ఇదేలా సాధ్యమని తహశీల్దార్ను అడిగారు. కాలక్రమేణా పట్టామార్పిడులు జరిగిన నేపథ్యంలో, అసలు పట్టాదారులు మరణించగా వారి వారసుల పేర్ల పై మార్పిడి, క్రయ విక్రయాల నేపథ్యంలో ఇలాంటి పొరపాటు జరిగి ఉండవచ్చని వివరించారు. సమస్య పరిష్కరించడానికి ప్రత్యేకంగా ఒక టీమ్ ఏర్పాటు చేసి 40.36 ఎకరాల భూమిని సర్వే చేయించాలని తహశీల్దార్కు సూచించారు. ప్రస్తు తం సాగుచేస్తున్న రైతుల వివరాలు సేకరించి ఎవరైతే సాగుచేస్తున్నారో వారికే పట్టాలు ఉంచి మిగతా వారి పట్టాలు రద్దు చేయాలని ఆదేశించారు. అనంతరం యాకర్పెల్లి గ్రామపంచాయతీ ఆవరణలో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ మొక్కలు నాటారు.
వరదల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి
నిర్మల్చైన్గేట్: వర్షాకాలంలో సంభవించే వరదలను సమర్థంగా ఎదుర్కొనేందుకు సంబంధిత శాఖల అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ తన చాంబరులో జిల్లా ఫ్లడ్ మ్యానువల్–2025 పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతేడాది జిల్లాలో నమోదైన వరదల వివరాలు, వాటి తీవ్రత, వాటివల్ల జరిగిన ఆస్తి, పంట నష్టం తదితర సమాచారాన్ని ఈ పుస్తకంలో సమగ్రంగా పొందుపరిచినట్టు తెలిపారు. ప్రస్తుత వర్షాకాలంలో తక్షణం తీసుకోవాల్సిన చర్యలు, సహాయక చర్యలు, పునరావాస ఏర్పాట్లు వంటి అంశాలు ఈ మ్యానువల్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్ కుమార్, ముఖ్య ప్రణాళికాధికారి జీవరత్నం పాల్గొన్నారు.
నిబంధనలు పాటించాలి
జిల్లాలోని ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ – 2010 నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయిలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) చట్టం – 2010, మహిళ శిశు రక్షణ చట్టాల అమలు, పర్యవేక్షణ అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని మహిళా శిశు రక్షణ చట్టాల అమలులో నిర్లక్ష్యం వహించొద్దని పేర్కొన్నారు. ఆసుపత్రులు రోగుల నుంచి అధిక చార్జీలు వసూలు చేయకూడదని, ప్రతీ ఆస్పత్రిలో రేటు చార్ట్ను రిసెప్షన్ వద్ద స్పష్టంగా ప్రదర్శించాలన్నారు. ప్రతీ ఆస్పత్రిలో కనీస ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, బయో మెడికల్ వేస్ట్ను సక్రమంగా నిర్వహించాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రైవేట్ వైద్య సంస్థలు, స్కానింగ్ సెంటర్లు, డయాగ్నొస్టిక్ ల్యాబ్లు తప్పనిసరిగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం కింద నమోదు చేసుకోవాలన్నారు. పీసీ అండ్ పీఎన్డీటీ చట్టం అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, లింగ నిర్ధారణకు పాల్పడే వారిపై నిఘా పెట్టాలన్నారు. లింగ నిర్ధారణ చర్యలకు పాల్పడే వారిపై ఫిర్యాదు చేసేందుకు ప్రజలు టోల్ఫ్రీ నంబర్ 7337448722 ను సంప్రదించాలని సూచించారు. ఆన్లైన్ మానిటరింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని సూచించారు. అన్ని వివరాలను ఆన్లైన్లో సమయానికి అప్డేట్ చేయాలన్నారు. అనంతరం పీసీ అండ్ పీఎన్డీటీ చట్టం, అమ్మ రక్ష పోస్టర్లను సంబంధిత అధికారులతో కలిసి ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రాజేందర్, జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ గోపాల్ సింగ్, డీసీహెచ్ఎస్ సురేశ్, సరోజ, సునీల్, ప్రైవేట్ వైద్య సంస్థల ప్రతినిధులు, డయాగ్నొస్టిక్ సెంటర్లు, ల్యాబ్ల ప్రతినిధులు పాల్గొన్నారు.