
ఇదెక్కడి ప‘రేషాన్’!
● మూడునెలల కోటాతో ఇబ్బందులు ● బయోమెట్రిక్ జాప్యంతో గంటల తరబడి క్యూ ● ఉదయం నుంచే దుకాణాల వద్ద పడిగాపులు
భైంసాటౌన్: వర్షాకాలం నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెల్ల రేషన్ కార్డుదారులకు మూడు నెలల రేషన్ బియ్యాన్ని ముందస్తుగా ఒకేసారి పంపిణీ చేస్తున్నాయి. ఒక్కో యూనిట్కు కేంద్ర ప్రభుత్వం ఐదు కిలోలు, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఒక కిలో కలిపి మొత్తం ఆరు కిలోల చొప్పున అందిస్తోంది. ప్రభుత్వ ఉద్దేశం సానుకూలమైనప్పటికీ, క్షేత్రస్థాయిలో పంపిణీ ప్రక్రియలో జాప్యం, సాంకేతిక సమస్యలతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బయోమెట్రిక్ సమస్యలతో...
రేషన్ పంపిణీలో బయోమెట్రిక్ విధానం ప్రధాన అడ్డంకిగా మారింది. సాధారణంగా ప్రతీ నెల ఒక్కసారి వేలిముద్ర ద్వారా బియ్యం పొందే లబ్ధిదారులు, ఈసారి మూడు నెలల రేషన్ కోసం ఆరుసార్లు బయోమెట్రిక్ వేయాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఐదు కిలోలకు ఒకసారి, రాష్ట్ర ప్రభుత్వం అందించే ఒక కిలోకు మరోసారి వేలిముద్ర వేయడంతో పాటు, వేర్వేరుగా కాంటా చేయడం వల్ల ఒక్కో లబ్ధిదారు?3కు 15 నిమిషాల సమయం పడుతోంది. దీనితో పంపిణీ ప్రక్రియలో గణనీయమైన జాప్యం జరుగుతోంది. అదనంగా, ఈ–పోస్ యంత్రాల్లో సర్వర్ సమస్యలు తలెత్తడం లబ్ధిదా రుల ఆందోళనను మరింత పెంచుతోంది.
భారీ క్యూ, సౌకర్యాల కొరత
రేషన్ దుకాణాల వద్ద ఉదయం 6 గంటల నుంచే లబ్ధిదారులు బారులు తీరుతున్నారు. గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంటి పనులు, బయటి వ్యవహారాలను వదిలి రేష న్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. అంతేకాక, దుకాణా ల వద్ద నీడ వసతులు లేకపోవడంతో ఎండలో ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితులు లబ్ధిదారులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.
నిల్వలపై ఆందోళన
సాధారణంగా ప్రతీ నెల 16 నుంచి 20 తేదీల మధ్య రేషన్ బియ్యం పంపిణీ పూర్తవుతుంది. అయి తే, ఈసారి మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయడంతో ప్రక్రియ ఆలస్యమవుతోంది. దీంతో బియ్యం నిల్వలు అయిపోతాయన్న భయంతో కార్డుదారులు రేషన్ దుకాణాలకు పరుగులు పెడుతున్నారు. అక్కడ దీర్ఘ క్యూలు, ఆలస్యం వల్ల బియ్యం అందుతుందో లేదోనన్న ఆందోళనలో ఉన్నారు. ఈ నెలాఖరు వరకు పంపిణీ కొనసాగించాలని వారు కోరుతున్నారు.
సమస్యల పరిష్కారానికి సూచనలు
ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించేందుకు కొన్ని చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. బయోమెట్రిక్ ప్రక్రియను సరళీకరించి, ఒక్కసారి వేలిముద్రతో మొత్తం బియ్యం పొందే వి ధంగా ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. అలా గే, సర్వర్ సమస్యలను త్వరగా పరిష్కరించడం, రేషన్ దుకాణాల వద్ద నీడ వసతులు, తాగునీరు వంటి ప్రాథమిక సౌకర్యాలను కల్పించాలని కోరుతున్నారు. ఈ చర్యలు అమలైతే లబ్ధిదారుల ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది.
మూడు గంటలు వేచి ఉన్నా...
రేషన్ బియ్యం తీసుకునేందుకు మూడు గంటలపాటు వేచి ఉన్నా. ఒక్కొక్కరికి ఆరుసార్లు వేలిముద్ర వేయాల్సి వస్తుంది. దీంతో గంటల తరబడి ఆలస్యమవుతోంది. దుకాణాల వద్ద ఎలాంటి సౌకర్యాలు లేవు. ఎండలో నిల్చోలేక ఇబ్బంది పడుతున్నాం.
– సాయినాథ్, భట్టిగల్లి, భైంసా
ఇంటి పని వదులుకుని...
మూడునెలల బియ్యం ఒకేసారి ఇస్తున్నరని దుకాణంకు వస్తే, ఇక్కడ గంటల కొద్ది ఆలస్యమైతుంది. ఆరుసార్లు వేలిముద్ర తీసుకుంటున్నరు. ఇంటి పని వదులుకుని దుకాణం వద్దనే గంటల తరబడి నిల్చున్న.
– అనితా బాయి, భట్టిగల్లి, భైంసా

ఇదెక్కడి ప‘రేషాన్’!

ఇదెక్కడి ప‘రేషాన్’!