బెంగుళూరు: హాసన్ తాలూకా బిట్టగోడనహళ్లిలో వ్యక్తి అనుమానాస్పద రీతిలో చనిపోగా, భార్య హడావుడిగా అంత్యక్రియలను పూర్తి చేసింది. చివరకు ఆమే, కొడుకు సూత్రధారులుగా తేలింది. పోలీసులు నమోదు చేసిన కేసు మేరకు... మే 18న ఇంట్లో గురుమూర్తి అనే వ్యక్తి పడుకుని అలాగే చనిపోయాడు. భార్య, కొడుకు గబగబా అంత్యక్రియలను ముగించారు. 17 ఏళ్ల క్రితం మైసూరుకు చెందిన గురుమూర్తికి హాసన్వాసి వీణాతో వివాహం చేశారు. దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. గురుమూర్తి భార్య వద్దే ఉంటూ, ఓ హోటల్ను నడుపుతున్నాడు. హోటల్ కోసం అప్పులు చేశాడు.
సీసీ కెమెరాలలో గుట్టు
కోడలు, మనవడు కలిసి తన కుమారున్ని చంపేశారని మృతుని తల్లి రేణుకమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇంటిలోని సీసీ కెమెరాలను పరిశీలించగా గుట్టు బయటపడింది. గురుమూర్తిని భార్య వీణా, మైనర్ కొడుకు కొట్టి చంపిన దృశ్యాలు రికార్డయ్యాయి. పోలీసులు పాతిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి వైద్యులచే పోస్టుమార్టం చేయించగా హత్యగానే నిర్ధారణ అయింది. మరోవైపు భార్య భర్త పేరుతో ఇన్సూరెన్స్లు చేసింది. ఆ డబ్బులు వస్తాయని హత్య చేసినట్లు విచారణలో తెలిపింది. ఆమెతో పాటు మైనర్ను అరెస్టు చేశారు.


