‘నీట్‌’రద్దుపై మరో రాష్ట్రం కీలక నిర్ణయం | West Bengal Demand All India Exam Old System On Neet Row | Sakshi
Sakshi News home page

‘నీట్‌’రద్దుపై మరో రాష్ట్రం కీలక నిర్ణయం

Jul 24 2024 4:58 PM | Updated on Jul 24 2024 6:11 PM

West Bengal Demand All India Exam Old System On Neet Row

కోల్‌కతా: నీట్‌ పరీక్షను రద్దు చేయబోమని, పేపర్‌ లీకేజీకి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం తీర్పిచ్చింది. ఆ తీర్పు పరిణామల అనంతరం నీట్‌ పరీక్ష కోసం రాజ్యాంగాన్ని సవరించాలని డిమాండ్‌ చేస్తున్న రాష్ట్రాల సంఖ్య రెండుకు చేరింది. ఇప్పటికే నీట్‌ పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు రాజ్యాంగాన్ని సవరించాలని తమిళనాడు ప్రభుత్వం డిమాండ్‌ చేస్తోంది.

తాజాగా, తమిళనాడు బాటలో పశ్చిమ బెంగాల్‌ చేరింది. నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా మెడికల్ కాలేజీలో తమ విద్యార్థులను చేర్చుకోకుండా రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని, నీట్ అమలుకు ముందు మాదిరిగా 12వ తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ అడ్మిషన్లు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలను అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌ విద్యాశాఖ మంత్రి బ్రత్యా బసు మాట్లాడుతూ..తాము అఖిల భారత పరీక్షలకు (నీట్‌) ఎప్పుడూ అనుకూలంగా లేమని, అయితే అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధాని నరేంద్రమోదీ ఒప్పించారని అన్నారు.

 నీట్‌లాంటి పరీక్షల నిర్వహణ బాధ్యతను కేంద్రం తీసుకునే సమయంలో మేం వ్యతిరేకించాం. నీట్ పరీక్షలను కేంద్రం నిర్వహించకూడదని అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ చెప్పారని ఆయన అన్నారు. అయినప్పటికీ నీట్‌ లాంటి పరీక్షలను కేంద్రమే నిర్వహిస్తోంది

కానీ ఇప్పుడు అలాంటి వ్యవస్థలోని లోపాలు విద్యా వ్యవస్థను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. కాబట్టే మేం పాత నీట్‌ పరీక్ష విధానాన్ని అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి బ్రత్యా బసు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement