న్యూఢిల్లీ: అత్తవారింట్లో అనుమానాస్పద స్థితిలో మరణించిన ట్విషా శర్మ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్విషా శర్మ మృతదేహానికి రెండోసారి పోస్ట్మార్టం నిర్వహించడానికి మధ్యప్రదేశ్ హైకోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది. ఈ రెండవ పోస్ట్మార్టంను ఎయిమ్స్ ఢిల్లీ బృందం నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.
ప్రాథమిక పోస్ట్మార్టం నివేదికలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తేలినప్పటికీ, ఆమె కుటుంబం ఈ నిర్ధారణలను తిరస్కరిస్తూ, ఇందులో కుట్ర ఉందని ఆరోపిస్తోంది. తమ బిడ్డను అత్తింటివారే ఆత్మహత్యకు పురికొల్పారని ఆరోపిస్తూ ట్వీషా తల్లిదండ్రులు మృతదేహానికి ఎయిమ్స్ ఢిల్లీ బృందంతో రీ-పోస్ట్మార్టం నిర్వహించాలని దిగువ కోర్టును ఆశ్రయించారు. దీన్ని కోర్టు తిరస్కరించడంతో, తిరిగి వారు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం జస్టిస్ అవనీంద్ర కుమార్ సింగ్ తాజా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే మృతదేహాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లడమా, ఎయిమ్స్ ఢిల్లీ డైరెక్టర్ ఏర్పాటు చేసిన, నిపుణుల బృందాన్ని విమానంలో పిలవడమా, ఈ రెండింటిలో ఏది ఉత్తమమైన మార్గమని ఈ కోర్టు అడగగా, అడ్వకేట్ జనరల్ తాము అన్ని ఏర్పాట్లు చేస్తామని, ఏ కమిటీని ఏర్పాటు చేసినా వీలైనంత త్వరగా వారు భోపాల్కు వచ్చి పోస్ట్మార్టం నిర్వహిస్తారని తెలిపారు.
మొదటి పోస్ట్మార్టంలో లోపాలున్నాయని, ట్విషా మరణించిన మూడు రోజుల తర్వాత కేసు నమోదు చేశారని, అలాగే ఉరి వేసుకోవడానికి ఉపయోగించినట్లు చెబుతున్న బెల్ట్ను మొదటి పోస్ట్మార్టం పరీక్ష సమయంలో అందించలేదని బాధితురాలి కుటుంబం ఆరోపించింది. మరోసారి పోస్ట్మార్టం చేయాలని డిమాండ్ చేసింది. అలాగే పోస్ట్మార్టం సమయంలో నమోదు చేసిన ట్విషా ఎత్తు, పోలీసు నివేదికలో పేర్కొన్న ఎత్తుతో సరిపోలడం లేదని బాధితురాలి న్యాయవాదివాదించారు. ఆమె శరీరంపై ఉన్న గాయాల గురించి పోస్ట్మార్టం నివేదికలో ఎందుకు వివరంగా ప్రస్తావించలేదని కూడ ప్రశ్నించారు.
కాగా మోడల్,నటి ట్విషా 2024లో ఒక డేటింగ్ యాప్ ద్వారా న్యాయవాది సమర్థ్ సింగ్తో పరిచయమైంది. ఆ తరువాత 2025 డిసెంబర్లో పెళ్లాడింది. పెళ్లైన ఐదు నెలలకే (మే 12న) ట్విషా అనుమానాస్పద రీతిలో కన్నుమూసింది. దీంతో భర్త, అత్తమామలు తమబిడ్డను శారీరక హింసతో సహా వివిధ రకాల వేధింపులకు గురి చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు.
ఈ డిమాండ్ను ట్విషా అత్తగారైన గిరిబాల సింగ్ తరఫు న్యాయ బృందం తీవ్రంగా వ్యతిరేకించింది. ఎయిమ్స్లోని నిపుణులచే ఇప్పటికే తొలి పరీక్ష పూర్తి అయిందికాబట్టి రెండో పరీక్ష అవసరం ఏముందని ప్రశ్నించారు. మరో పోస్ట్మార్టం కోరడం అంటే వృత్తిపరమైన వైద్యుల సామర్థ్యాలపై అవిశ్వాసాన్ని చూపడ మేనని వారు వాదించారు.
మరోవైపు గత పదిరోజులుగా పరారీలో ఉన్న ట్విషా శర్మ భర్త సమర్థ్ సింగ్ హైకోర్టులో తనమ ముందస్తు బెయిల్ దరఖాస్తును ఉపసంహరించుకుని, విచారణకు ముందే లొంగిపోవడానికి ముందుకొచ్చారు. ఈ విషయాన్ని ఆయన న్యాయవాది శుక్రవారం మధ్యప్రదేశ్ హైకోర్టుకు తెలియజేశారు
ఇదీ చదవండి: ‘దీదీ కాపాడు’ అని మొరపెట్టుకున్న కొన్ని క్షణాల్లోనే


