10 శాతం చికెన్‌ తెలంగాణదే | Telangana State ranks 5th in chicken production in the country | Sakshi
Sakshi News home page

10 శాతం చికెన్‌ తెలంగాణదే

Jun 8 2025 2:17 AM | Updated on Jun 8 2025 2:17 AM

Telangana State ranks 5th in chicken production in the country

దేశంలో చికెన్‌ ఉత్పత్తిలో 5వ స్థానంలో రాష్ట్రం 

2023–24లో 5.10 లక్షల టన్నుల ఉత్పత్తి 

7.56 లక్షల టన్నులతో మొదటి స్థానంలో మహారాష్ట్ర  

దేశంలో మొత్తం చేపల ఉత్పత్తిలో మూడోవంతు ఏపీలోనే 

21.93 కోట్ల హెక్టార్లకు పెరిగిన సాగు భూమి 

ఎన్‌వీ స్టాట్స్‌ ఇండియా–2025 నివేదికలో వెల్లడి 

దేశంలో కోడి మాంసం (చికెన్‌) ఉత్పత్తిలో తెలంగాణ  5వ స్థానంలో నిలిచింది. 2023–24 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 50.19 లక్షల టన్నుల చికెన్‌ ఉత్పత్తి అయ్యింది. అందులోతెలంగాణలో 10 శాతం.. అంటే 5.10 లక్షల టన్నుల ఉత్పత్తి  జరిగింది. 7.56 లక్షల టన్నులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత పశ్చిమబెంగాల్‌ 6.75 లక్షల టన్నులు, హరియాణాలో 6.36 లక్షల టన్నులు, తమిళనాడులో 5.58 లక్షల టన్నుల చికెన్‌ ఉత్పత్తి అయ్యింది. 

కాగా, రాజస్తాన్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో చికెన్‌ వినియోగం అతి తక్కువగా ఉంది. ఇటీవల కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఎన్‌వీ స్టాట్స్‌ ఇండియా–2025 నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.     – సాక్షి, న్యూఢిల్లీ

ఏడాదిలో కోటి టన్నుల మాంసం 
దేశవ్యాప్తంగా 2023–24 సంవత్సరంలో అన్నిరకాల మాంసాలు కలిసి 1.02 కోట్ల టన్నుల ఉత్పత్తి జరిగింది. అందులో అత్యధికంగా చికెన్‌ ఉత్పత్తి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 10.67 లక్షల టన్నులు, తెలంగాణలో 11.12 లక్షల టన్నుల మాంసం ఉత్పత్తి జరిగింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా 1.84 కోట్ల టన్నుల చేపల ఉత్పత్తి జరగ్గా, 51.58 లక్షల టన్నులతో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. 2015–16లో ఏపీలో చేపల ఉత్పత్తి 23.52 లక్షల టన్నులు మాత్రమే. అదే సమయంలో తెలంగాణలో 4.56 లక్షల టన్నులు చేపలు ఉత్పత్తి అయ్యాయి.  

స్వల్పంగా పెరిగిన సాగుభూమి 
దేశంలో 2019–20 సంవత్సరంలో మొత్తం 21.13 కోట్ల హెక్టార్లలో పంటలు పండగా, 2022–23 నాటికి స్వల్పంగా పెరిగి 21.93 కోట్ల హెక్టార్లకు పెరిగాయి. దేశంలో 2022–23లో సాగుయోగ్యం కాని భూమి 4.43 కోట్ల హెక్టార్లు ఉంది. 1996–97లో దేశంలో 7.60 కోట్ల హెక్టార్ల స్థూల నీటిపారుదల ప్రాంతం ఉండగా... 2022–23 నాటికి 12.22 కోట్ల హెక్టార్లకు పెరిగింది. 

ఆంధ్రప్రదేశ్‌లో సాగుచేసిన మొత్తం భూమిలో 25,876 హెక్టార్లు సేంద్రియ ప్రాంతం ఉండగా, 37,801 హెక్టార్లు కన్వర్టెడ్‌ ప్రాంతం ఉంది. తెలంగాణలో మొత్తం సాగు చేసిన భూమిలో కేవలం 5,399 హెక్టార్లు సేంద్రియ ప్రాంతం, 79,465 హెక్టార్లు కన్వర్టెడ్‌ ప్రాంతం ఉందని సర్వేలో తేలింది. 

సర్వేలోని మరికొన్ని అంశాలు.. 
» 1950–51లో దేశంలో 10.11 కోట్ల హెక్టార్లలో ఆహార పంటలు సాగు చేయగా... 2023–24 నాటికి 13.21 కోట్ల హెక్టార్లకు పెరిగింది. ఇందులో అత్యధికంగా 10.43 కోట్ల హెక్టార్లలో తృణధాన్యాలు, చిరుధాన్యాల సా గు ఉంది. ఆ తర్వాత స్థానంలో 4.78 కోట్ల హెక్టార్లలో వరి సాగైంది. 137.8 మిలియన్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగింది. 

»  దేశ భూభాగంలో 21.76% విస్తీర్ణంలో అడవులు వ్యాపించి ఉన్నా యి. 2015లో 7,64,566 చదరపు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం ఉండగా.. 2023 నాటికి 7,75,377 చ.కి.మీలకు పెరిగింది. అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 94,689 చ.కి.మీ. అటవీ ప్రాంతం ఉంది. 

»  2015 నుంచి 2023 వరకు ఆంధ్రప్రదేశ్‌లో 37,258 చ.కి.మీ.మేర మొత్తం అటవీ ప్రాంతం ఉండగా.. దట్టమైన అడవుల విస్తీర్ణం 26,006 చ.కి.మీ. నుంచి 30,084 చ.కి.మీ.లకు పెరిగింది. అదే సమయంలో తెలంగాణలో మొత్తం అటవీ ప్రాంతం 26,904 చ.కి.మీ. నుంచి 27,688 చ.కి.మీ.కు అటవీ ప్రాంతం పెరిగింది. దట్టమైన అటవీ విస్తీర్ణం 19,854 చ.కి.మీ. నుంచి 21,179 చ.కి.మీ.లకు విస్తరించింది. 

»  దేశవ్యాప్తంగా హైడ్రో, థర్మల్, న్యూక్లియర్, పునరుత్పాదక శక్తి వనరుల ద్వారా 1947లో 4,073 గిగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కాగా, 2023–24 నాటికి 17,34,375 గిగావాట్లకు పెరిగింది. ఇందులో అత్యధికంగా 13,26,549 గిగావాట్లు థర్మల్‌ విద్యుత్‌ ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement