చెన్నై: తమిళనాడులో పెను విషాదం చోటు చేసుకుంది. విరుధునగర్ జిల్లా కట్టనార్పట్టి ప్రాంతంలో ఆదివారం భారీ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక వనజ బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
పేలుడు ధాటికి కిలోమీటర్ల మేర ప్రకంపనలు సంభవించాయి. కర్మాగారంలోని నాలుగు గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గాయపడిన వారిని అత్యవసర చికిత్స కోసం సమీప ఆసుపత్రులకు తరలించారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. మొదట నలుగురు మరణించినట్లు సమాచారం వచ్చినా, కొద్ది సమయంలోనే మరణాల సంఖ్య 17కి పెరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.


