న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐదుగురు కొత్త న్యాయమూర్తులు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. దీనితో సుప్రీంకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తుల సంఖ్య 32 నుండి 37కి పెరిగింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు మంజూరైన న్యాయమూర్తుల సంఖ్యను 34 నుండి 38కి పెంచుతూ ఆర్డినెన్స్ జారీ చేసిన నేపథ్యంలో, ఈ నియామకాలు జరిగాయి.
కొత్త న్యాయమూర్తులు వీరే..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్ ఈ ఐదుగురు న్యాయమూర్తుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిలో జస్టిస్ షీల్ నాగు, జస్టిస్ చంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్ సచ్దేవా, జస్టిస్ అరుణ్ పల్లి ఉన్నారు. వీరంతా ఇప్పటికే వివిధ హైకోర్టులలో ప్రధాన న్యాయమూర్తులుగా సేవలు అందించిన అనుభవం కలిగి ఉన్నారు. అదేవిధంగా సీనియర్ న్యాయవాది వి. మోహన నేరుగా బార్ నుండి సుప్రీంకోర్టు బెంచ్కు పదోన్నతి పొందడం గమనార్హం.
Swearing-in Ceremony of the five newly appointed Supreme Court judges to commence at 10:30 am#SupremeCourt pic.twitter.com/sJHvOZyqAo
— Bar and Bench (@barandbench) June 2, 2026
వేగంగా సాగిన ప్రక్రియ
ఈ నియామకాలకు సంబంధించి సిఫార్సులను గత వారమే ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం సిద్ధం చేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం జూన్ 1న అధికారికంగా ఆమోదముద్ర వేసింది. సాధారణంగా సుప్రీంకోర్టులో నియామక ప్రక్రియకు కాస్త సమయం పడుతుంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేయడం గమనార్హం.
పెరిగిన న్యాయస్థానం సామర్థ్యం
సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి, న్యాయమూర్తుల కొరతను అధిగమించడానికి ఈ నియామకాలు ఎంతో కీలకం. కాగా రాబోయే రోజుల్లో మరో ఖాళీ కూడా భర్తీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. కొత్తగా చేరిన న్యాయమూర్తుల రాకతో సుప్రీంకోర్టు తీర్పులలో వేగం, పరిపాలనా సామర్థ్యం మరింత పుంజుకోనుందని నిపుణులు భావిస్తున్నారు.
సరికొత్త చరిత్ర సృష్టించిన సీనియర్ న్యాయవాది వి. మోహన
సాక్షి, చెన్నై: దేశ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా నియమితులై తమిళనాడుకు చెందిన సీనియర్ న్యాయవాది వి. మోహన సరికొత్త చరిత్ర సృష్టించారు. సుప్రీంకోర్టులో బాధ్యతలు చేపట్టనున్న తమిళనాడుకు చెందిన మొట్టమొదటి మహిళా న్యాయమూర్తిగా ఆమె అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఈ చారిత్రాత్మక నియామకంపై తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఇక తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ అడ్వకేట్ వి. మోహన నియామకంతో సుప్రీంకోర్టు చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైందని చెప్పవచ్చు. కాగా సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ, ఏకంగా నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులవుతున్న భారతదేశపు రెండవ మహిళా న్యాయమూర్తిగా ఆమె మరో రికార్డు సృష్టించారు.
మహిళా సాధికారతకు నిదర్శనం
ఆమెకు దక్కిన గుర్తింపుపై సీఎం విజయ్ ఎక్స్ పేజీ వేదికగా అభినందనలు తెలియజేశారు. సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తిగా తమిళనాడు, కోయంబత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ న్యాయవాది వెంకిడ సుబ్రమణి మోహన గారు నియమితులవ్వడం ఎంతో సంతోషాన్ని, గర్వాన్ని కలిగిస్తోందన్నారు. సుప్రీంకోర్టు చరిత్రలోనే నేరుగా న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన రెండో మహిళగా, తమిళనాడు నుండి ఈ గౌరవాన్ని దక్కించుకున్న తొలి మహిళగా ఆమె నిలిచారన్నారు. జస్టిస్ మోహన ఈ నియామకం దేశంలో, రాష్ట్రంలో మహిళా విద్యాభివృద్ధికి, వారి ఆర్థిక సాధికారతకు , సామాజిక పురోగతికి ఒక గొప్ప ఉత్తేజకర శక్తిగా నిలుస్తుందన్నారు. అత్యున్నత బాధ్యతలు చేపట్టబోతున్న జస్టిస్ మోహనకు తన తరపున, తమిళనాడు ప్రభుత్వం , రాష్ట్ర ప్రజల తరపున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆమోద ముద్ర అనంతరం జస్టిస్ వి. మోహన అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. తమిళనాడుకు చెందిన ఒక మహిళా న్యాయవాది దేశ అత్యున్నత న్యాయస్థానంలో అడుగుపెట్టనుండటం పై తమిళనాడు న్యాయవాద సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.


