Rickshaw Overturned Potholed Road Uttar Pradesh Sitapur - Sakshi
Sakshi News home page

గుంతల రోడ్డు.. పెద్దల కాన్వాయ్‌కి దారివ్వబోయి పేదోడి వాహనం బోల్తా

Oct 11 2022 4:28 PM | Updated on Oct 11 2022 7:44 PM

Rickshaw Overturned Potholed Road Uttar Pradesh Sitapur - Sakshi

అధికారుల తీరుపై  నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఐఏఎస్, ఐపీఎస్ శిక్షణలో నేర్పింది ఇదేనా? సామాన్యులను పట్టించుకోరా అని మండిపడ్డారు

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ సీతాపుర్‌లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గుంతలమయం, వర్షపు నీటితో కూడిన రోడ్డుపై జిల్లా మెజిస్ట్రేట్‌ కాన్వాయ్ వెళ్తుండగా.. దానికి ఆటోరిక్షా(ఈ-రిక్షా) సైడ్ ఇవ్వబోయింది. ఈ క్రమంలోనే అదుపుతప్పి బోల్తాపడింది. అందులోని ప్రయాణికులందరు బురద నీటిలో పడిపోయారు. ఇంత జరిగినా కన్వాయ్‌లో వెళ్తున్న అధికారులు, సిబ్బంది మాత్రం ఏమీ పట్టనట్టు అలాగే వెళ్లిపోయారు. కనీసం వాహనం దిగి ఎవరికైనా ఏమన్నా అయిందా అని కూడా చూడలేదు.

ఇందుకు సంబంధించిన వీడియోను స్థానికులు ఒకరు ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్‌గా మారింది. అధికారుల తీరుపై  నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఐఏఎస్, ఐపీఎస్ శిక్షణలో నేర్పింది ఇదేనా? సామాన్యులను పట్టించుకోరా అని మండిపడ్డారు. సామాన్యులు నడిరోడ్డుపై కిందపడినా పట్టించుకోని అధికారులు, ఇక ప్రభుత్వ కార్యాలయాలకు పని కోసం వెళ్తే వాళ్లను అసలు పట్టించుకుంటారా? అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో నవంబర్ 15నాటికి గుంతల రోడ్లు ఉండొద్దని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇటీవలే అధికారులను ఆదేశించారు. మెరుగైన రోడ్లు ప్రజల హక్కు అని ఉన్నతస్థాయి సమావేశంలో చెప్పారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం ప్రభుత్వంపై విమర్శలకు దారితీసింది.
చదవండి: అశ్రునయనాల మధ్య ములాయం అంత్యక్రియలు

Advertisement
 
Advertisement
Advertisement