షిల్లాంగ్: గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పెళ్లైన 11 రోజులకే భార్య సోనమ్ రఘువంశీ చేతిలో దారుణ హత్యకు గురైన రాజా రఘువంశీ మళ్లీ పుట్టాడని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. రాజా రఘువంశీ సోదరుడు సచిన్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చాడు.
ఈ సందర్భంగా తన తమ్ముడు రాజా మళ్లీ పుట్టాడంటూ అన్న సచిన్ ఆనందం వ్యక్తం చేశాడు. తన కుమారుడికి ‘రాజా’ అని నామకరణం చేసినట్లు తెలిపాడు. రాజా రఘువంశీ చంద్రపక్షంలోని పదకొండవ రోజు అయిన ఏకాదశి రోజే హత్యకు గురయ్యాడు. యాదృచ్ఛికంగా నా కుమారుడు కూడా అదే ఏకాదశి రోజే జన్మించాడు. ఇది దేవుడి ఆశీర్వాదమేనని, తన తమ్ముడు మళ్లీ జన్మించి కుటుంబంలోకి అడుగు పెట్టాడ’ని సంతోషం వ్యక్తం చేశాడు.
రాజా రఘువంశీ తల్లి ఉమా రఘువంశీ ఇండోర్లో మీడియాతో మాట్లాడుతూ.. ‘నా కుమారుడు తిరిగి వచ్చాడు’. రాజా రాక కోసం ఇంటిని బెలూన్లతో అలంకరించినట్లు చూపించారు. ఇంటి బయట ‘Raja is Back’ అంటూ డిజైన్ చేసిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

పెళ్లైన 12రోజులకే భర్తను హత మార్చిన భార్య
ఏప్రిల్ 23న రాజా రఘువంశీ,సోనమ్ రఘువంశీల వివాహం జరిగింది.పెళ్లైన 12 రోజులకే ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి జీవించేందుకు సోనమ్ కుట్ర చేసింది. తన భర్త రాజ రఘవంశీ హత్య చేయాలనుకుంది. ఇందుకోసం సోనమ్ తన ప్రియుడు సాయంతో విశాల్ చౌహాన్,ఆనంద్ కుమార్,కాష్ రాజ్పుత్లకు సుపారీ ఇచ్చింది.
ఒప్పందం ప్రకారం.. రాజా రఘువంశీని హతమార్చి తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని వీ సావ్డాంగ్ హిల్స్లో పడేశారు. జూన్ 2న అదే జలపాతం వద్ద గుర్తు పట్టలేని విధంగా ఉన్న రాజ రఘువంశీ మృత దేహాన్ని గుర్తించిన టూరిస్టులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో గతేడాది జూన్లో భార్య సోనమ్ రఘువంశీ, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా,మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ అయ్యారు.

కనిపించని పశ్చాత్తాపం..
పోలీసుల దర్యాప్తులో ప్రియుడితో కలిసి జీవించేందుకే తన భర్త రాజా రఘువంశీని హత్య చేసినట్లు సోనమ్ రఘువంశీ నేరాన్ని అంగీకరించారు. భర్తను హత్య చేసిన కేసులో విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం సోనమ్ మేఘాలయా షిల్లాంగ్ జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. కాగా, భర్త హత్య చేసినందుకు సోనమ్లో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదని జైలు అధికారులు చెప్పినట్లు అప్పట్లో పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.


