వైరల్​ : బతికేందుకు ఒక్క అవకాశం ఇవ్వండి

Punjab CM Helps DSP Harjinder Singh Treatment After Viral Video - Sakshi

పంజాబ్​లో సోషల్ మీడియాను ఓ వైరల్​ వీడియో కుదిపేసింది. నా ట్రీట్​మెంట్ కోసం సాయం చేయండి. బతకడానికి నాకొక అవకాశం ఇవ్వండి. అంటూ ఓ డీఎస్పీ లెవెల్​ అధికారి మాట్లాడిన వీడియో ఒకటి వాట్సాప్​, ఫేస్​బుక్​లో వైరల్  అయ్యింది. చావు అంచున ఉన్న తనను కాపాడాలంటూ వేడుకున్న ఆయన వీడియో పై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని పార్టీలు, ప్రజలు విమర్శించడంతో ఆ దెబ్బకు ప్రభుత్వం దిగొచ్చింది. 

ఛంఢీఘడ్​: డిప్యూటీ జైలు సూపరిడెంట్​గా పని చేస్తున్న 49 ఏళ్ల హర్జిందర్​ సింగ్​కు ఈ మధ్యే కరోనా సోకింది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత రకరకాల సమస్యలతో ఆయన లూథియానాలో ఓ ఆస్పత్రిలో చేరారు. అయితే ఊపిరితిత్తులు చెడిపోవడంతో ఆయన పరిస్థితి రోజురోజూకీ దిగజారింది. లంగ్స్ మారిస్తే ఆయన బతుకుతాడని డాక్టర్లు ఆయన కుటుంబ సభ్యులతో చెప్పారు. ఇక ఆయనకు సాయం అందించే విషయంలో పంజాబ్​ ప్రభుత్వం మూడువారాల పాటు అలసత్వం ప్రదర్శించింది. పరిస్థితి విషమిస్తుండడంతో.. చచ్చాక తన కుటుంబానికి నష్టపరిహారం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చే బదులు.. బతికేందుకు అవకాశం ఉన్న తనకు సాయం చేయాలని, తన కుటుంబాన్ని తానే పోషించుకుంటానని ఆయన దీనంగా వేడుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

ఎక్స్​గ్రేషియాపై విమర్శలు
డిప్యూటీ జైలు సూపరిడెంట్​గా పని చేస్తున్న హర్జిందర్ సింగ్​.. భార్య వదిలేసి పోవడంతో ముగ్గురు పిల్లలను ఆయనే పోషిస్తున్నారు.  ఏప్రిల్ నెలలో కొవిడ్ బారినపడి కోలుకున్నారు. లంగ్స్​ ట్రాన్స్​ప్లాంట్​ కోసం 80 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. పంజాబ్​ ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. అంత ఖర్చు ఇవ్వడానికి వీల్లేదు. చనిపోయాక యాభై లక్షల రూపాయల ఎక్స్​గ్రేషియా కుటుంబానికి మాత్రమే అందిస్తారు. దీంతో సాయం గురించి ఉన్నతాధికారులు మూడు వారాలపాటు హర్జిందర్​ సోదరుడిని తిప్పించుకున్నారు. ఈ తరుణంలో చనిపోయాక ఇచ్చే నష్టపరిహారం తనకొద్దని, బతికేందుకు తనకొక అవకాశం ఇవ్వమని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆయన వీడియో ద్వారా వేడుకున్నాడు.

మూడువారాల తర్వాత..
ఇక ఈ వీడియోపై రాజకీయ దుమారం రేగింది. పోలీస్ డిపార్ట్​మెంట్​తో పాటు ప్రభుత్వం తీరుపైనా విమర్శలు వెల్లువెత్తాయి. ఒక సిన్సియర్ ఉన్నతాధికారి రక్షించుకోలేని చేతకాని ముఖ్యమంత్రి అంటూ.. అమరిందర్​ సింగ్​పై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోశాయి. కొందరు నెటిజన్స్​ ఈ విమర్శలకు మద్ధతు తెలపడంతో ప్రభుత్వం దిగొచ్చింది. డీఎస్పీ ట్రీట్​మెంట్​కు అవసరమయ్యే సాయం ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఒప్పుకున్నారని డీజీపీ దిన్కర్​ గుప్తా ట్వీట్ చేశారు. హర్జిందర్ సింగ్​కు డిపార్ట్​మెంట్ తరపున  లూథియానాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉచితంగా ట్రీట్​మెంట్ అందించబోతున్నట్లు, ట్రాన్స్​ఫ్లాంట్ కోసం హైదరాబాద్​ గానీ, చెన్నై గానీ తరలిస్తామని సిటీ కమిషనర్ రాకేష్​ అగర్వాల్ ప్రకటించారు.
చదవండి: సీఎంని కదిలించిన పిల్లాడు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top