పుణే: యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. లోహగఢ్ ఫోర్ట్ సమీపంలోని లోయలో అతన్ని ఎవరు తోసి చంపారన్న అంశంపై పోలీసులు ఇప్పటికీ స్పష్టమైన నిర్ధారణకు రాలేకపోయారు. ప్రత్యక్ష సాక్షులు లేకపోవడం, దర్యాప్తులో పరస్పర విరుద్ధమైన వాదనలు బయటపడుతుండటంతో కేసు మరింత సంక్లిష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితురాలిగా ఉన్న సియా గోయల్ మరోసారి వివాదంలో చిక్కుకుంది.
క్రైమ్ రీక్రియేషన్లో భాగంగా.. పోలీసులు ఆమెను తన నివాసానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో బయటకు తీసుకువస్తున్న సమయంలో మీడియా ఎదుట ఆమె మిడిల్ ఫింగర్(అసభ్య సైగ) చూపింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ ఆమె ప్రవర్తనను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది.
Pune, Maharashtra: Siya Goyal, accused in the Ketan Agarwal murder case, was taken by Pune Rural Police to her Market Yard residence for investigation. After the investigation was completed, while leaving the house, Siya Goyal allegedly made obscene gestures and showed the middle… pic.twitter.com/mHnQKlfRrq
— IANS (@ians_india) July 2, 2026
జూన్ 18న పుణే సమీపంలోని లోహ్గఢ్ కోట వద్ద కేతన్ అగర్వాల్ అనుమానాస్పద రీతిలో మరణించాడు. మొదట ఈ ఘటనను ప్రమాదవశాత్తు మరణంగా నమోదు చేసినప్పటికీ.. దర్యాప్తులో ఇది ఒక ప్లాన్ ప్రకారం జరిగిన హత్యగా తేలింది. సియా గోయల్, కేతన్ అగర్వాల్ కుటుంబాలు ముందే వివాహాన్ని ఖరారు చేశాయి. నవంబర్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. ప్రియుడు చేతన్తో కలిసి కేతన్ను సియా హతమార్చింది. అయితే..
కేసులో ఎవరు నిజంగా కేతన్ను లోయలోకి తోశారన్న అంశంపై స్పష్టత లేకపోవడంతో పోలీసులు లై డిటెక్టర్ పరీక్ష అవసరమని కోర్టును అభ్యర్థించారు. నిందితులు మౌనం వహిస్తున్నందున దర్యాప్తుకు ఇది కీలకంగా మారిందని అధికారులు చెబుతున్నారు. అయితే నిందితురాలి సమ్మతి తప్పనిసరి అని ఆమె తరఫు న్యాయవాది పేర్కొన్నారు.
పాలీగ్రాఫ్ పరీక్ష ఫలితాలు ప్రత్యక్ష సాక్ష్యాలుగా పరిగణించబడవని, అవి కేవలం దర్యాప్తును ముందుకు తీసుకెళ్లేందుకు సహాయపడతాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కోర్టు తీర్పుపై సస్పెన్స్ కొనసాగుతోంది.
మరోవైపు దర్యాప్తులో కీలకంగా జనవరి నుంచి జూన్ వరకు సియా–చేతన్ మధ్య 2,000కు పైగా కాల్స్ జరిగినట్లు కాల్ డేటా విశ్లేషణలో బయటపడింది. ఘటన అనంతరం కేతన్ మొబైల్ ఫోన్ కొంతసేపు సియా వద్దే ఉన్నట్లు సాంకేతిక ఆధారాలు కూడా లభించినట్లు సమాచారం. 33 డిగ్రీల ఎండలోనూ చేతన్ హుడీ ధరించి అనుమానాస్పదంగా తిరుగుతున్న సీసీటీవీ దృశ్యాలు కూడా పోలీసులు గుర్తించారు.
దర్యాప్తులో భాగంగా పోలీసులు రెండు దశల్లో ఘటన స్థలంలో సీన్ రీక్రియేషన్ నిర్వహించారు. సియా సమక్షంలో డమ్మీ సాయంతో ఒకసారి, చేతన్ను తీసుకెళ్లి మరోసారి లోహగఢ్ ఫోర్ట్ వద్ద సంఘటనను పునర్నిర్మించినట్లు సమాచారం. ప్రత్యక్ష సాక్షులు లేకపోవడంతో ఫోరెన్సిక్ విశ్లేషణ, డిజిటల్ ఆధారాల రికవరీపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ కేసును ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించింది. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 103 (హత్య), 61 (కుట్ర) కింద కేసు నమోదు కాగా, నిందితుల పోలీస్ కస్టడీ కొనసాగుతోంది. ఒకవైపు నిందితురాలి వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపుతుండగా, మరోవైపు లై డిటెక్టర్ టెస్ట్ కోసం పోలీసులు చేస్తున్న ప్రయత్నం ఈ కేసును మరింత కీలక దిశలోకి తీసుకెళ్లింది.


