స్వచ్ఛంగా భారత ఇం‘ధనం’! | Our renewable energy capacity has reached 232 gigawatts | Sakshi
Sakshi News home page

స్వచ్ఛంగా భారత ఇం‘ధనం’!

Jun 5 2025 2:50 AM | Updated on Jun 5 2025 2:50 AM

Our renewable energy capacity has reached 232 gigawatts

జోరు మీదున్న పునరుత్పాదక ఇంధన రంగం 

మొత్తం సామర్థ్యం 232 గిగావాట్లకు చేరిక 

ప్రపంచంలో నాలుగో అతిపెద్ద దేశంగా స్థానం 

పదేళ్లలో మూడింతల పెరుగుదల 

పర్యావరణ కాలుష్యం రోజురోజుకీ పెరుగుతున్న వేళ స్వచ్ఛ ఇంధనం ప్రాధాన్యత పెరుగుతోంది. అందుకే మనదేశం కూడా గ్రీన్‌ ఎనర్జీపై దృష్టి పెట్టింది. అంతేకాదు, ప్రపంచానికి మార్గదర్శకంగానూ నిలుస్తోంది. మన పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 232 గిగావాట్లకు చేరుకుంది. తద్వారా ఈ రంగంలో ప్రపంచంలో నాలుగో అతిపెద్ద దేశంగా నిలిచింది. 2014లో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 75.52 గిగావాట్లు మాత్రమే. అంటే పదేళ్లలో సామర్థ్యం మూడింతలు పెరిగిందన్న మాట. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్వచ్ఛ ఇంధన రంగంలో మనదేశం సాధించిన పురోగతిపై ప్రత్యేక కథనం. 

2030 నాటికి 500 గిగావాట్ల సామర్థ్యాన్ని అందుకోవాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఏటా 50 గిగావాట్లకుపైగా గ్రీన్‌ ఎనర్జీ సామర్థ్యాన్ని జోడించాల్సి ఉంటుంది. భారత పునరుత్పాదక ఇంధన రంగం 2020 ఏప్రిల్‌ నుంచి 2024 సెపె్టంబర్‌ మధ్య సుమారు 20 బిలియన్‌డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అందుకుంది. 

2047 నాటికి మొత్తం పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 1,800 గిగావాట్ల మైలురాయికి చేరాలన్నది భారత ప్రభుత్వ దీర్ఘకాలిక లక్ష్యం. అందుకు అనుగుణంగా ముందుకు సాగుతున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. అందుకు నిదర్శనం.. ఈ రంగంలో ప్రభుత్వం చేస్తున్న వ్యయం పెరగడమే. 2019–20 నుంచి 2023–24 నాటికి... పునరుత్పాదక ఇంధనానికి సంబంధించిన పథకాలు, కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.3,193 కోట్ల నుంచి రూ.6,119 కోట్లకు పెరిగింది.

టాప్‌లో సోలార్‌ పవర్‌.. 
సౌర విద్యుత్‌ ఉత్పత్తిలో భారత్‌ ప్రపంచంలో మూడవ, పవన విద్యుత్‌ రంగంలో నాల్గవ అతిపెద్ద దేశంగా అవతరించడం విశేషం. 2023లో మొత్తం పునరుత్పాదక విద్యుత్‌ 18.5 గిగావాట్లు, 2024లో 25 గిగావాట్లు అదనంగా వచ్చి చేరింది. 2014లో దేశంలో సౌర విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం కేవలం 2.63 కోట్లే. కానీ, ప్రభుత్వ చర్యల ఫలితంగా 2025 నాటికి ఏకంగా 108 గిగావాట్లకు ఎగసింది. అంటే 41 రెట్ల పెరుగుదల అన్నమాట. దీంతో పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్‌ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది. పవన విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం 51 గిగావాట్లకు పెరిగింది. 2014లో ఇది 21 గిగావాట్లు.  

మాడ్యూల్స్‌ తయారీలో.. 
సౌర విద్యుదుత్పత్తి విషయానికి వస్తే సోలార్‌ మాడ్యూల్స్‌ తయారీ సామర్థ్యం దేశంలో 2014లో 2.3 గిగావాట్లు మాత్రమే. 2024 నాటికి ఇది 90 గిగావాట్లను తాకింది. 2030 నాటికి 150 గిగావాట్లకు చేరుకోవాలని భారత్‌ ఆకాంక్షిస్తోంది. దశాబ్దం క్రితం దేశీయంగా సోలార్‌ సెల్స్, వేఫర్‌ల ఉత్పత్తి పరిమితంగా ఉండేది. నేడు సోలార్‌ సెల్స్‌ ఉత్పత్తిలో 25 గిగావాట్లు, వేఫర్‌ ఉత్పత్తిలో 2 గిగావాట్లతో భారత్‌ తన స్థానాన్ని పదిలపర్చుకుంది.

దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి స్వయం సమృద్ధి గల దేశంగా మారే ప్రయత్నంలో మన దేశం 2030 నాటికి సోలార్‌ సెల్స్‌ ఉత్పత్తిలో 100 గిగావాట్స్, వేఫర్‌ ఉత్పత్తిలో 40 గిగావాట్ల సామర్థ్యాన్ని అందుకోవాలని కృత నిశ్చయంతో ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూ.24,000 కోట్లతో చేపట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం సౌర విద్యుత్‌ రంగానికి ఊపునిచ్చింది.  

దూకుడుగా ప్రభుత్వం.. 
2025 ఫిబ్రవరి నాటికి దాదాపు 176 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. 70.21 గిగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టులకు టెండర్లు దాఖలయ్యాయి. సముద్రం లేదా సరస్సులో ఏర్పాటు చేసే ఆఫ్‌షోర్‌ పవన విద్యుత్‌ ప్రాజెక్టుల విభాగంలో 2030 నాటికి 37 గిగావాట్ల మేర టెండర్లను ఆహ్వానించాలని భారత్‌ నిర్ణయించింది. గుజరాత్, తమిళనాడులో పైలట్‌ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఆర్‌ఈ–ఇన్వెస్ట్‌ 2024 వేదికగా భారత స్వచ్ఛ ఇంధన రంగంలో 2030 నాటికి రూ.32.45 లక్షల కోట్ల పెట్టుబడులకు వివిధ దేశాలకు చెందిన కంపెనీలు ముందుకు వచ్చాయి. 

ఇక దేశంలోని మొత్తం విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంలో శిలాజేతర విద్యుత్‌ సామర్థ్యం వాటా 2014తో పోలిస్తే 32.5% నుండి గత ఏడాది 47.37%కి పెరిగింది. ప్రధానమంత్రి సూర్య ఘర్‌ ప్రాజెక్టును 2024 ఫిబ్రవరిలో కేబినెట్‌ ఆమోదించింది. 2026–27 నాటికి దేశంలో ఒక కోటి గృహాలకు రూఫ్‌టాప్‌ సోలార్‌ను ఏర్పాటు చేయడానికి మొత్తం రూ.75,021 కోట్ల వ్యయం చేయాలని నిర్ణయించారు. 

దీని ద్వారా అదనంగా 30 గిగావాట్ల సౌర సామర్థ్యం లభిస్తుందని అంచనా. రూ.19,744 కోట్లతో జాతీయ గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌ను మంత్రివర్గం ఆమోదించింది. 2030 నాటికి ఈ మిషన్‌ కింద 125 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం అదనంగా చేరనుంది.  – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement