
దేశ రాజధానిలో 1 నుంచి అమల్లోకి కొత్త రూల్
ఎన్సీఆర్ పరిధిలో పెట్రోల్ బంక్ల వద్ద కెమెరాలు
వాహనాల డేటాబేస్తో నంబర్ ప్లేట్ల గుర్తింపు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రరూపం దాల్చుతున్న వాయు కాలుష్యం సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరో నిబంధనను అమల్లోకి తేనున్నాయి. పదేళ్లు దాటిన వాహనాలకు బంక్ల్లో డీజిల్, పెట్రోల్ నిరాకరించేలా ఆదేశాలు జారీ అయ్యాయి. పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలకు, 15 ఏళ్లు దాటిన పెట్రోల్తో నడిచే వాహనాలకు జూలై ఒకతో తేదీ నుంచి బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయవద్దంటూ మార్గదర్శకాలు జారీ అయ్యాయి.
ఈ విధానం మిగతా ప్రాంతాల్లోనూ విడతల వారీగా అమల్లోకి రానుందని సమాచారం. ఇందులో భాగంగా వాహనాలను గుర్తించేందుకు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగి్నషన్ (ఏఎన్పీఆర్) కెమెరాల నెట్వర్క్ను ఢిల్లీలో ఉన్న 520 బంకుల్లో ఏర్పాటయ్యాయి. వాహన డేటాబేస్తో అనుసంధానించిన ఈ వ్యవస్థలు, పాతబడిన, నిబంధనలను పాటించని వాహనాలను అప్పటికప్పుడు గుర్తిస్తాయి. జూలై 1వ తేదీ నుంచి ఈ కెమెరాలు బంకుల్లోకి వచ్చే వాహనాలను గుర్తించి సిబ్బందిని అప్రమత్తం చేస్తాయి. వాహన రిజి్రస్టేషన్ నంబర్ సాయంతో ఇతర వివరాలను తక్షణమే క్రాస్ చెక్ చేస్తాయి.
వాహనం ఈఎల్వీ(ఎండ్ ఆఫ్ లైఫ్ వెహికల్)గా గుర్తించినా లేదా చెల్లుబాటయ్యే పొల్యూషన్ సరి్టఫికెట్ లేకున్నా సిస్టమ్ ఆపరేటర్కు ఆడియో హెచ్చరికను జారీ చేస్తాయి. అక్టోబర్ 31 నుంచి గుర్గావ్, ఫరీదాబాద్, ఘాజియాబాద్, గౌతమ్ బుద్ధనగర్, సోనిపట్ ప్రాంతాల్లో ఈ విధానం అమల్లోకి వస్తుంది. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఎన్సీఆర్ పరిధిలోని మిగిలిన ప్రాంతాల్లోనూ అమలులోకి రానుంది. ఢిల్లీలో 10–15 ఏళ్లు దాటిన వాహనాలు 62 లక్షల వరకు ఉన్నట్లు రవాణా శాఖ గుర్తించింది.