‘భిన్నత్వంలో ఏకత్వానికి కట్టుబడాలి’ | Mamata Banerjee Says India Always Upheld Age Old Legacy Of Unity In Diversity | Sakshi
Sakshi News home page

దీదీ కీలక వ్యాఖ్యలు

Aug 5 2020 3:51 PM | Updated on Aug 5 2020 5:51 PM

Mamata Banerjee Says India Always Upheld Age Old Legacy Of Unity In Diversity - Sakshi

భిన్నత్వంలో ఏకత్వం మనదైన విధానమని దీన్ని కొనసాగించాలని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు

కోల్‌కతా : భారత్‌లో ఎప్పటినుంచో అనుసరిస్తున్న ఏకత్వంలో భిన్నత్వాన్ని అదే స్ఫూర్తితో మనం తుదిశ్వాస విడిచేవరకూ కొనసాగించాలని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం పేర్కొన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరిగేందుకు కొన్ని గంటల ముందు ఆమె సోషల్‌ మీడియా వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. తన ట్వీట్‌లో మమతా బెనర్జీ ఎక్కడా అయోధ్య, రామమందిరం అంశాలను ప్రస్తావించలేదు. దేశంలో హిందూ, ముస్లిం, సిక్కులు సహా అందరూ సోదరభావంతో మెలుగుతారని, మేరా భారత్‌ మహాన్‌..మహాన్‌ హమారా హిందుస్తాన్‌ అని దీదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

రామ మందిర ఉద్యమంపై మమతా బెనర్జీతో పాటు తృణమూల్‌ కాంగ్రెస్‌ తొలినుంచీ ఆచితూచి వ్యవహరిస్తోంది. గత ఏడాది నవంబర్‌లో వివాదాస్పద స్ధలంలో మందిర నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపైనా మమతా బెనర్జీ ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. మరోవైపు అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహిస్తున్న క్రమంలో బెంగాల్‌ అంతటా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. రాజ్‌భవన్‌లో దీపాలు వెలిగించి వేడుక నిర్వహిస్తామని గవర్నర్‌ జగ్దీష్‌ దంకర్‌ తెలిపారు. ఇక అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అత్యంత వైభవంగా భూమిపూజ కార్యక్రమం జరిగింది. చదవండి : కరోనాపై పోరులో మహిళా అధికారి కన్నుమూత

Advertisement
 
Advertisement
Advertisement