
ముంబై : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు వేగంగా ప్రబలుతున్నా మాస్క్ ధరించడం వంటి కనీస జాగ్రత్త చర్యలనూ కొందరు పట్టించుకోవడం లేదు. నిర్లక్ష్యంతో వైరస్ను కొనితెచ్చుకోవడమే కాకుండా మహమ్మారి వ్యాప్తికీ కారణమవుతున్నారు. కరోనా కట్టడికి మాస్క్ తప్పనిసరని నాగపూర్ నగరంలో మాస్క్ ధరించనివారికి విధించే 200 రూపాయల జరిమానాను 500 రూపాయలకు పెంచుతున్నట్టు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ స్పష్టం చేశారు. చదవండి : పార్లమెంట్లో కరోనా కలకలం..!
కోవిడ్-19కు వ్యాక్సిన్ వచ్చే వరకూ అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలను అనుసరించాలని అన్నారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా చాలా మంది మాస్క్లు ధరించడం లేదని, సోమవారం నుంచి మాస్క్ ధరించని వారి నుంచి వసూలు చేసే జరిమానాను 200 రూపాయల నుంచి 500 రూపాయలకు పెంచుతామని మంత్రి పేర్కొన్నారు. ఇక గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 97,654 తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూడటంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 47,51,788కి ఎగబాకింది. మరణాల సంఖ్య 78,614కు పెరిగిందని అధికారులు వెల్లడించారు. మహారాష్ట్రలో కోవిడ్-19 కేసుల సంఖ్య పది లక్షల మార్క్ను అధిగమించింది.