బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామాకు ఆమోదం దక్కింది. సిద్దరామయ్య రాజీనామాను గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆమోదించారు. దీంతో, డీకే శివకుమార్కు లైన్ క్లియర్ అయ్యింది. ప్రస్తుతం డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఢిల్లీలో ఉన్నారు. ఇద్దరు నేతలు కాసేపట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలవనున్నారు.
ఇదిలా ఉండగా.. కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కొద్దిసేపటికే సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్లారు. తదుపరి ప్రభుత్వ ఏర్పాటుపై అధిష్ఠానంతో చర్చించేందుకే ఆయన హస్తిన వెళ్లినట్లు అధికార వర్గాలు తెలిపాయి. తదుపరి ముఖ్యమంత్రిగా భావిస్తున్న డీకే శివకుమార్ కూడా ఢిల్లీకి పయనమయ్యారు. కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం కొత్త శాసనసభాపక్ష నేత ఎంపిక, మంత్రివర్గ కూర్పుపై సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అధిష్ఠానంతో చర్చించనున్నారు. ప్రస్తుతం శివకుమార్ నిర్వహిస్తున్న కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి మరొకరిని ఎంపిక చేయడంపైనా చర్చించే అవకాశముంది. రాజ్యసభకు, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లబోనని చెబుతున్న సిద్ధరామయ్య, తదుపరి కర్ణాటక ప్రభుత్వంలో ఎలాంటి పాత్ర పోషించనున్నారనేది కూడా ఆసక్తికరంగా మారింది.


