ఢిల్లీ: కర్ణాటకలో నూతన ప్రభుత్వ ఏర్పాటు, మంత్రిమండలి కూర్పు వ్యవహారం హస్తినకు చేరుకుంది. మాజీ, కాబోయే సీఎంలు ఇద్దరూ హుటాహుటిన దేశ రాజధానికి వెళ్లారు. ఎవరెవరికి మంత్రి పదవులు కేటాయించాలి, ప్రభుత్వం ఎలా సాగాలి అనే దానిపై చర్చిస్తున్నారు. రేపటి(బుధవారం)లోగా కొత్త అమాత్యుల జాబితా రెడీ కావచ్చు.
కర్ణాటక కేబినెట్ కూర్పుపై కసరత్తు జరుగుతోంది. అధిష్టానం పెద్దలతో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ చర్చలు జరుపుతున్నారు. దాదాపు పదిమంది పేర్లపై ఏకాభిప్రాయం వచ్చినట్లు సమాచారం. మంత్రి వర్గంతో పాటు రాజ్యసభ కౌన్సిల్ సీట్ల పైన చర్చలు జరుపుతున్నారు. పార్టీ అధ్యక్షుడిగా సతీష్ జర్కి హోలీ, హెచ్కే పాటిల్, బీకే హరిప్రసాద్కు శివకుమార్ మద్దతు పలకగా, అహింద వర్గాలకు ప్రాధాన్యత కలిగిన శాఖలు ఇవ్వాలని సిద్ధరామయ్య ఒత్తిడి చేస్తున్నారు. సిద్ధరామయ్య వర్గానికి 10కి మించి మంత్రి పదవులు ఇవ్వకూడదనే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
జీ.పరమేశ్వర, జమీర్ అహ్మద్ ఖాన్, కేజే జార్జ్, ఎంబి పాటిల్లకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలని సిద్ధరామయ్య పట్టుబడుతున్నారని.. మరో వైపు ఎవరికి కూడా ఉప ముఖ్యమంత్రుల పదవులు ఇవొద్దని డీకే శివకుమార్ వాదిస్తున్నట్లు సమాచారం. అలాగైతే మరో పవర్ సెంటర్గా మారుతారని డీకే వాదిస్తున్నారు. సిద్ధ రామయ్య తనయుడు యతేంద్రకు క్యాబినెట్లో చోటు కల్పించేందుకు అధిష్టానం ఓకే చెప్పింది. తొలి దశలో పది నుంచి 20 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. రేపు(బుధవారం) ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
సిద్దరామయ్య సతీమణి పార్వతి, తనయుడు యతీంద్రకు పదవులు లభిస్తాయనే ప్రచారం ఊపందుకుంది. రాజీనామా చర్చల సమయంలో హైకమాండ్ నేతలు సిద్దరామయ్యకు రాజ్యసభ స్థానం ఆఫర్ ఇచ్చారు. కానీ సిద్దరామయ్య రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగుతానని చెప్పారు. ఆయనకు బదులు భార్య పార్వతికి రాజ్యసభ సీటు ఇస్తారని తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు కూడా సిద్దరామయ్య అంగీకరించలేదని, ఆమెకు రాజకీయాలతో ఏమాత్రం పరిచయం లేదని చెప్పారని సమాచారం. ఇక పుత్రుడు యతీంద్రకు మంత్రి లేదా డిప్యూటీ సీఎం పదవి దక్కడం ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది.


