విమానాశ్రయ అధికారుల అత్యుత్సాహం ఒక ఐటీ ఉద్యోగి జీవితాన్ని నరకప్రాయం చేసింది. ఏ తప్పూ చేయకుండానే 57 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించిన సదరు సాఫ్ట్వేర్ ఇంజనీర్కు 16 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత సరైన న్యాయం దక్కింది. బాధితుడికి రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అసలేమి జరిగిదంటే?
2010 ఏడాదిలో గ్వాలియర్కు చెందిన అజయ్ సింగ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఢిల్లీ వెళ్లడానికి భోపాల్లోని రాజా భోజ్ విమానాశ్రయానికి వచ్చాడు. అయితే భద్రతా తనిఖీల్లో భాగంగా అజయ్ను బ్యాగ్ను స్క్రీనింగ్ మిషన్లోకి పంపినప్పుడు.. మిషన్ ఒక్కసారిగా అలర్ట్ ఇచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు అతడి బ్యాగ్ను తెరిచి చూశారు.
అందులో ఒక తెల్లటి పొడి పదార్ధం కన్పించింది. ఎయిర్పోర్ట్ అధికారులు ఏమాత్రం ఆలోచించకుండా, కేవలం సాంకేతికతను నమ్మి అది అంతర్జాతీయ మార్కెట్లో నిషేధించబడిన మత్తుపదార్థం అని తేల్చేశారు. అజయ్ సింగ్ అది డ్రగ్ కాదు, వంటల్లో వాడే పొడి అని చెప్పినా అధికారులు వినలేవు. అతడిపై నార్కోటిక్స్ సెషన్స్ కింద కేసులు పెట్టి జైలుకు పంపారు.
సరిగ్గా 57 రోజుల తర్వాత ఫోరెన్సిక్ లాబ్ నుంచి నివేదిక వచ్చింది. ఆ రిపోర్ట్ చూసి అధికారులకు దిమ్మతిరిగిపోయింది. అందులో ఉన్నది డ్రగ్స్ కాదు.. సాదాసీదా ఆమ్చూర్ పౌడర్ (మామిడికాయ పొడి) రిపోర్ట్లో స్పష్టంగా తేలింది. . దీంతో ఆయనను జైలు నుంచి విడుదల చేశారు.
ఆ తర్వాత కేవలం మిషన్ రీడింగ్పై ఆధారపడి తనను అన్యాయంగా జైలుకు పంపారని అజయ్ సింగ్ జబల్పూర్ హైకోర్ట్ను ఆశ్రయించాడు. 16 ఏళ్ల పాటు సాగిన న్యాయపోరాటం అనంతరం జబల్పూర్ హైకోర్టు అతడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.


