నిప్పుల కొలిమి | India Weather Split With Scorching Heat | Sakshi
Sakshi News home page

నిప్పుల కొలిమి

Apr 22 2026 3:58 AM | Updated on Apr 22 2026 3:58 AM

India Weather Split With Scorching Heat

దేశవ్యాప్తంగా మండుతున్న ఎండలు

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉత్తరాదిన అనేక రాష్ట్రాల్లో మంగళవారం ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌ వరకు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని బందాలో అత్యధికంగా 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. యూపీతోపాటు రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఒడిశాల్లో ఈ తీవ్రత ఎక్కువగా ఉంది. అదే సమయంలో, ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన టాప్‌–20 నగరాల్లో 19 మన దేశంలోనివే కావడం గమనార్హం. మరో మూడు రోజులు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఈ సీజన్‌లో యూపీ, హరియాణా, జార్ఖండ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రల్లో ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు సాధారణానికి మించి వడగాడ్పులు వీచే అవకాశాలున్నాయని ఐఎండీ చీఫ్‌ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు.

వీటితోపాటు పశ్చిమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఇవే పరిస్థితులుంటాయని హెచ్చరించారు. మంగళవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన టాప్‌–20 జాబితాలో యూపీలోని బందా, బిహార్‌లోని భాగల్పూర్, ఒడిశాలోని తాల్చేర్, పశ్చిమబెంగాల్‌లోని అసన్‌సోల్‌ నగరాలు న్నాయి. ఇక్కడ 44 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. వీటితోపాటు బిహార్‌లోని బెగుసరాయ్, మోతిహారి, ముంగేర్, భోజ్‌పూర్, సివాన్‌లతోపాటు యూపీ, పశ్చిమ బెంగాల్‌లలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకు రికార్డయ్యాయి. టాప్‌–20 నగరాల్లో మనదేశంలో లేని ఏకైక నగరం నేపాల్‌లోని లుంబిని మాత్రమే కావడం గమనార్హం. మధ్యప్రదేశ్‌ చరిత్రలో తొలిసారిగా భోపాల్‌లో ‘నైట్‌ హీట్‌ వేవ్‌’(రాత్రిపూట వడగాల్పులు) హెచ్చరికలు జారీ అయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement