సరిహద్దు గస్తీపై కీలక పురోగతి | India, China reach agreement on patrolling along LAC in Eastern Ladakh | Sakshi
Sakshi News home page

సరిహద్దు గస్తీపై కీలక పురోగతి

Oct 22 2024 5:02 AM | Updated on Oct 22 2024 5:02 AM

India, China reach agreement on patrolling along LAC in Eastern Ladakh

భారత్‌–చైనా మధ్య ఒప్పందం 

న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ విషయమై చైనాతో నెలకొన్న నాలుగేళ్ల పై చిలుకు సైనిక వివాదం కొలిక్కి వచి్చంది. ఇరు దేశాల దౌత్య, సైనిక ఉన్నతాధికారులు కొద్ది వారాలుగా జరుపుతున్న చర్చల ఫలితంగా ఈ విషయమై కీలక ఒప్పందం కుదిరింది. విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ సోమవారం ఈ మేరకు ప్రకటించారు. ‘‘తాజా ఒప్పందం ఫలితంగా తూర్పు లద్దాఖ్‌లోని దెస్పాంగ్, దెమ్‌చోక్‌ తదితర ప్రాంతాల నుంచి చైనా సైన్యం వెనుదిరుగుతుంది. 

అక్కడ ఇకపై భారత సైన్యం 2020కి ముందు మాదిరిగా గస్తీ కాస్తుంది’’ అని విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల దిశగా దీన్నో మంచి ముందడుగుగా అభివర్ణించారు. రష్యాలో జరగనున్న బ్రిక్స్‌ సదస్సులో భాగంగా మంగళ, బుధవారాల్లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ప్రధాని కీలక భేటీ ఉండొచ్చన్న వార్తల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం విశేషం. ఈ వివాదానికి తెర దించేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ కూడా గత వారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీతో రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో చర్చలు జరిపారు. చైనాతో సరిహద్దు వివాదానికి సంబంధించి 75 శాతం సమస్యలు ఇప్పటికే పరిష్కారమైనట్టు జైశంకర్‌ గత నెలలో పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement