ఆర్జీకర్ బాధితురాలి తల్లి, ఎమ్మెల్యే రత్నా దేవ్నాథ్ వ్యాఖ్య
కోల్కతా: ‘ఈ రోజు నేను, మమత(మాజీ సీఎం మమతా బెనర్జీ) విచారంలో మునిగి ఉన్నాం. నేను ఒక్కగానొక్క కుమార్తెను కోల్పోయి దుఃఖంలో మునిగి ఉండగా, ఆమె ముఖ్యమంత్రి పదవినే కోల్పోయారు’అంటూ సోమవారం ఆర్జీ కర్ హత్యాచార ఘటన బాధితురాలి తల్లి, బీజేపీ ఎమ్మెల్యే రత్నా దేవనాథ్ ఎక్స్లో వ్యాఖ్యానించారు. అంతకుముందు, ఆమె కోల్కతాలోని సెక్రటేరియట్లో సీఎం సువేందు అధికారితో భేటీ అయ్యారు. అనంతరం ఎక్స్లో ..‘ఈ రోజు సెక్రటేరియట్ నబన్నాలోని 14వ అంతస్తులో ముఖ్యమంత్రిని కలుసుకున్నాను.
ఆయన పేరు సువేందు అధికారి. నిజాయతీలో అద్భుతమైన శక్తి దాగుంది. అన్యాయానికి వ్యతిరేకంగా ఓరిమితో పోరాటం సాగించాలి’అని రత్న పేర్కొన్నారు. ‘మాజీ సీఎం మమత, ఆమె బృందం మరింత విషాదాన్ని మున్ముందు చవిచూస్తుంది. ఎదురు చూస్తూ ఉండండి’అంటూ వ్యాఖ్యానించారు. సెక్రటేరియట్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతూ..ఎమ్మెల్యేగా ఎన్నికవడం సంతోషకరమే అయినప్పటికీ, తన కుమార్తెకు న్యాయం చేయడమే ఏకైక లక్ష్యమన్నారు. తన కుమార్తె మరణానికి కారణంగా భావించే వారికి సంబంధించిన వివరాలను సీఎంకు అందజేశానన్నారు.


